
సూర్యఘర్ యోజనపై సమీక్ష
ఏలూరు(మెట్రో): జిల్లాలో పీఎం సూర్య ఘర్ కింద సోలార్ ప్యానల్ యూనిట్ల రిజిస్ట్రేషన్లు, స్థాపన ప్రక్రియను వేగవంతం చేసి మంచి ప్రగతిని సాధించాలని కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో సూర్య ఘర్ యోజన పథకంపై విద్యుత్తు శాఖ అధికారులు, బ్యాంకర్లు, సోలార్ కంపెనీలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 5 లక్షలు కుటుంబాలు ఉండగా కనీసం లక్ష దరఖాస్తులు రావాలని, 70 వేలు లక్ష్యం కాగా ఇంతవరకు 52 వేలు దరఖాస్తులు అందాయన్నారు. లక్ష్యం మేరకు సాగకపోవడంపై కారణాలను సమీక్షించారు. సూర్య ఘర్ పథకం లక్ష్యాలను సాధించాలన్నారు. సమావేశంలో విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు పి.సాల్మన్రాజు, లీడ్ బ్యాంకు మేనేజరు డి.నీలాద్రి, ఈఈ ఎ.రాధాకృష్ణ, డీఈ నోడల్ అధికారి ఏ.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ ప్రవేశాలకు నేడు, రేపు కౌన్సెలింగ్
ఏలూరు (టూటౌన్): ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న బీ.ఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో మిగిలిన ఇంటర్మీడియట్ సీట్ల అడ్మిషన్ కోసం ఈ నెల 26, 27 తేదీలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయ అధికారిణి బి.ఉమాకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలకు ఈ నెల 26న వట్లూరు గురుకులంలో, 27న బాలురకు పెదవేగి గురుకులంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారని తెలిపారు.