ఉంగుటూరు: కంకర అక్రమ తవ్వకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన కూటమి నాయకులే ఈ దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉంగుటూరు మండలం మెట్టప్రాంతంలో సుమారు 20 కిలోమీటర్లు పోలవరం కుడి కాలువ ఉంది. ఈ కాలువ గట్టుపై రాత్రినక పగలనక తవ్వకాలు యథేచ్ఛగా జరిపారు. దీంతో కాలువగట్లు స్వరూపాలు మారిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ గట్టు మీద తవ్వకాలు పూర్తికాగా ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి సరిహద్దు ప్రాంతంనుంచి భీమడోలు మండలం సరిహద్దు ప్రాంతాల నుంచి కంకర తవ్వి తరలిస్తున్నారు. ఉంగటూరు మండలం కంసాలిగుంట రోడ్డునుంచి గొల్లగూడెం మీదుగా ఈ దందా సాగుతోంది. మట్టి దందాలో వీఆర్వోలు, రెవెన్యూ అధికారులు సైతం పాలు పంచుకున్నట్లు ప్రజలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరైనా పలానాచోట కంకర తవ్వి పట్టుకుపోతున్నారని అధికారులకే చెబుతుంటే వెంటనే ఆ విషయాన్ని కంకర మాఫీయా వ్యక్తులకు నిమిషాల వ్యవధిలో చేరవేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ పూర్ణచంద్రప్రసాద్ను వివరణ కోరగా తమకు ఎక్కడైనా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదు వస్తే వెంటనే కేసులు పెట్టడం జరగుతుందన్నారు. మట్టి అక్రమ తవ్వకాలు జరగకుండా ఇరిగేషన్, రెవెన్యూ ఉద్యోగులను గస్తీ పెడుతున్నట్లు చెప్పారు. మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.
ఆగని కంకర అక్రమ తవ్వకాలు