ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. సోమవారం జరిగిన తెలుగు పరీక్షకు 25,179 మంది విద్యార్థులకు 23,064 మంది హాజరయ్యారు. 91.60 శాతం హాజరు నమోదైంది. ఏలూరు అశోక్నగర్లోని కేపీడీటీ నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన తాగునీరు, ఇతర వసతులను, వైద్య శిబిరాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. పరీక్షా కేంద్రాల తనిఖీలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు 54 పరీక్షా కేంద్రాలను, డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ 9 కేంద్రాలు, తాను 6 కేంద్రాలు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ 4 కేంద్రాలను తనిఖీ చేసినట్టు చెప్పారు.
ప్రశాంతంగా పది పరీక్షలు