మీ అవగాహనే బ్రహ్మాస్త్రం | - | Sakshi
Sakshi News home page

మీ అవగాహనే బ్రహ్మాస్త్రం

Mar 15 2025 1:49 AM | Updated on Mar 15 2025 1:47 AM

శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025

వినియోగదారుడి విజయాలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా వినియోగదారుల కమిషన్‌ ద్వారా వినియోగదారులు పలు విజయాలను సాధించారు. తెలంగాణ ఆర్టీసీ పరిధిలో సేవల లోపంపై ఏలూరుకు చెందిన బీకెఎస్‌ఆర్‌ అయ్యంగార్‌ రూ.10 వేల నష్టపరిహారం అందుకున్నారు. ఆర్‌ఆర్‌పేటలోని వెంకటేశ్వరస్వామి గుడిలో విక్రయించే ప్రసాదాల్లో నాణ్యతా లోపంపై వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడంతో రాష్ట్రంలోని దేవాలయాలన్నింటిలో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. యురేకా ట్రేడర్స్‌కు సంబంధించిన కేసులో బాధితుడికి రూ.40 వేలు నష్టపరిహారం చెల్లించాలని కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. అమెజాన్‌లో సేవల లోపానికి బీకే బింధు నష్టపరిహారం కోసం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడంతో అమెజాన్‌ రూ.13 వేల నష్టపరిహారం చెల్లించింది.

ఏలూరు (టూటౌన్‌): ఇటీవల జిల్లాలో తూనికలు, కొలతల్లో వ్యాపారుల మోసం ఎక్కువైంది. వినియోగదారులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఎలక్ట్రానిక్‌ కాటాలు రావడంతో మోసం చేసేవారికి మరింత సులువైంది. నిత్యావసరాలు, కూరగాయాలు, చికెన్‌, మటన్‌ వంటివే గాకుండా రైతుల వద్ద వ్యాపారులు కొను గోలు చేసే ధాన్యం, చేపలు, రొయ్యల తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. కిలోకు దాదాపు 100 గ్రాముల తక్కువ బరువుతో వినియోగదారుడిని మోసగిస్తున్నారు. తక్కెడకు వినియోగించే కిలో, అర కిలో రాళ్లను తూనికలు, కొలతల అధికారులు నిత్యం పర్యవేక్షించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో కొంతమంది వ్యాపారులు రాళ్లను అరగదీయడం, లోపల కన్నాలు పెట్టి పైన పూత వేయడం వంటి మోసాలకు పాల్పడుతున్నారు.

పెట్రోల్‌ బంకుల్లో మోసాలు

పెట్రోల్‌ కంపెనీలు డీలర్లుకు బంక్‌లను లీజుకు ఇచ్చి నిర్వహణ చేస్తుంటాయి. కొందరు డీలర్లు పెట్రోల్‌, డీజిల్‌ పంపులకు ఉండే డిజిటల్‌ మిషన్‌లో కంపెనీలకు తెలియకుండా మార్పులు, చేర్పులు చేసి వియోగదారురులను మోసగిస్తున్నాయి. స్వీట్‌ షాపు యజమానులు తూనికల్లో మోసం చేస్తున్నారు. వినియోగదారులకు కేవలం స్వీట్‌ మాత్రమే తూకం వేయాల్సివుండగా స్వీట్స్‌ పెట్టే బాక్స్‌లను సైతం తూకం వేసి విక్రయిస్తున్నారు.

బిల్‌ తప్పనిసరి

ఏదైనా వస్తువు కొనుగోలు చేసిన వారిని వినియోగదారుడుగా గుర్తిస్తారు. అమ్మే వారిని ట్రేడర్‌ అంటారు. ట్రేడర్‌ వద్ద కొనుగోలు చేసి బయటకు వచ్చి తర్వాత దానిలో ఏదైనా లోపం గుర్తించి తిరిగి తీసుకోమంటే ట్రేడర్‌ తమకు సంబంధం లేదనేవారు. 2019లో చేసిన సవరణ ప్రకారం సరకు నాణ్యత, పనితీరుపై అమ్మిన వారిదే పూర్తి బాధ్యత. ఇదే క్రమంలో వినియోగదారులు తాము కొనుగోలు చేసిన రూ.50 విలువకు పైన ఉన్న ప్రతి ఐటెమ్‌కు ఖచ్చితంగా బిల్‌ తీసుకోవాలి. బిల్‌తో పాటు ఆ వస్తువుకు సంబంధించిన వారెంటీ కార్డులు వంటివి భద్రపర్చుకోవాలి. ట్రేడర్స్‌ ఇచ్చే బిల్‌లో ఎస్టిమేషన్‌ కాకుండా ఇన్‌వాయిస్‌ బిల్లు.. ఆ ట్రేడర్‌కు సంబంధించిన లెటర్‌ హెడ్‌పైన స్టాంప్‌ వేసింది మాత్రమే తీసుకోవాలి. దీనివల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు అమ్మిన ట్రేడర్‌ను నిలదీసే అధికారం ఉంటుంది.

అవగాహన పెంచుకోవాలి

వినియోగదారుడు తమ హక్కు లపై అవగాహన పెంచుకోవాలి. ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. వస్తుసేవల్లో ఏవిధమైన లోపం జరిగినా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. వినియోగదారుల కమిషన్‌లో ఏడు కేసుల్లోనూ విజయం సాధించాం.

– బీకేఎస్‌ఆర్‌ అయ్యంగార్‌, మాజీ అధ్యక్షుడు, కన్స్యూమర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, ఏలూరు

1,274 కేసుల నమోదు

ఏడాది ఇంతవరకూ నిబంధనలు అతిక్రమించిన వారిపై 1274 కేసులు నమోదు చేశాం. వాటిలో తూనికలు కొలతలకు సంబంధించినవి 491 కేసులు, ప్యాకేజీల్లో తేడాలకు సంబంధించిన 783 కేసులు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాంపిగ్‌ ఫీజు కింద ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ. 1,65,53,073 వసూలు చేశాం. వివిధ కేసులకు సంబంధించి జరిమానాగా రూ.83,54,500 విధించాం.

– పీ సాయిరాం, అసిస్టెంట్‌ కంట్రోలర్‌, తూనికలు, కొలతల శాఖ

న్యూస్‌రీల్‌

ఎవరిని ఆశ్రయించాలి ?

వినియోగదారుడు తనకు జరిగిన అసౌకర్యానికి నేరుగా జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. సంబంధిత ట్రేడర్‌కు కమిషన్‌ ముందుగా నోటీసు ఇస్తుంది. 10 నుంచి 15 రోజుల వ్యవధిలో స్పందించక పోతే అరెస్టు వారెంట్‌ సైతం జారీ చేస్తారు. గతంలో వినియోగదారుల ఫోరం తీర్పుపై ఇతర కోర్టులకు వెళ్లేవారు. ప్రస్తుతం నేరుగానే వినియోగదారుల కమిషన్‌ తీర్పును అమలు చేయాల్సి ఉంది. కమిషన్‌ తీర్పును అమలు చేయని ట్రేడర్లకు సంబంధించిన ఆస్తులను జప్తుచేసి బాధిత వినియోగదారుడికి నష్టపరిహారం చెల్లించే వెసులు బాటు ఉంది. 3 నెలల లోపు వినియోగదారునికి న్యాయం జరగాలి.

మనం కొనే వస్తువు, అందించే సేవలో ఏదైనా లోపం ఉంటే న్యాయం పొందే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగిన వస్తువులు లేదా సేవలు పొందడం వినియోగదారుడి ప్రాథమిక హక్కు. ఇటీవల కాలంలో వస్తువుల్లో నాణ్యతా లోపాలు, తూకాల్లో మోసాలు, సేవల్లో నిర్లక్ష్యం వంటివి ఎక్కువై పోయాయి. తాగే పాళ్లు, నీళ్లను కూడా కల్తీ చేస్తున్నారు. సామాన్యుడు వీటిని ప్రశ్నించలేక ఎక్కడికక్కడ సర్దుకుపోతున్నాడు. ఈ తరహా మోసాలను అరికట్టేందుకు వినియోగదారుడు మేల్కొనాలి. అందుకే ఏటా మార్చి 15న అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

వస్తువుల నాణ్యత, సేవల్లో లోపాలకు చెక్‌

వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదుతో అక్రమాలకు అడ్డుకట్ట

నేడు అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

మీ అవగాహనే బ్రహ్మాస్త్రం 1
1/5

మీ అవగాహనే బ్రహ్మాస్త్రం

మీ అవగాహనే బ్రహ్మాస్త్రం 2
2/5

మీ అవగాహనే బ్రహ్మాస్త్రం

మీ అవగాహనే బ్రహ్మాస్త్రం 3
3/5

మీ అవగాహనే బ్రహ్మాస్త్రం

మీ అవగాహనే బ్రహ్మాస్త్రం 4
4/5

మీ అవగాహనే బ్రహ్మాస్త్రం

మీ అవగాహనే బ్రహ్మాస్త్రం 5
5/5

మీ అవగాహనే బ్రహ్మాస్త్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement