దేవినేనివారిగూడెంలో పెద్దపులి | - | Sakshi
Sakshi News home page

దేవినేనివారిగూడెంలో పెద్దపులి

Jan 29 2024 1:44 AM | Updated on Jan 29 2024 1:44 AM

ముండూరులో పెద్ద పులి కదలికలపై చర్చిస్తున్న అటవీ శాఖాధికారులు  - Sakshi

ముండూరులో పెద్ద పులి కదలికలపై చర్చిస్తున్న అటవీ శాఖాధికారులు

ద్వారకాతిరుమల: గత కొద్ది రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి శనివారం అర్ధరాత్రి ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడెంలోకి ప్రవేశించింది. ఒక తోటలో కట్టి ఉన్న పశువులపై దాడి చేయడంతో రెండు ఆవులు, ఒక ఆవు దూడ తీవ్రంగా గాయపడ్డాయి. విషయం తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు పులి భయంతో వణికిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రైతు పాకలపాటి మధు రోజులానే పశువులను తన ఆయిల్‌పామ్‌ తోటలో శనివారం సాయంత్రం కట్టేశాడు. తిరిగి పాలు తీసేందుకు ఆదివారం తెల్లవారుజామున తోటలోకి వెళ్లాడు. అయితే ఒక ఆవు కట్లు తెంచుకుని దూరంగా బెదురుగా ఉండడాన్ని గుర్తించి దగ్గరకు వెళ్ళి చూడగా ఆవు శరీరంపై గాయాలు కనిపించాయి. అలాగే మరో ఆవు, దూడ శరీరాలపై కూడా గాయాలు ఉండటం, ఆ ప్రాంతంలో పులి పాదముద్రలు ఉండటంతో భీతిల్లి ఈ విషయాన్ని స్థానిక రైతులకు, అటవీశాఖ అధికారులకు తెలిపాడు. దీంతో అటవీ శాఖ రాజమండ్రి సర్కిల్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ డీఎఫ్‌వో త్రిమూర్తుల రెడ్డి, ఏలూరు జిల్లా డీఎఫ్‌వో రవీంద్ర ధామా, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ పశువులను పరిశీలించారు. పులి పంజాతో కొట్టడం వల్ల ఏర్పడిన గాయాలేనని అధికారులు నిర్ధారించారు. అలాగే పులి పాదముద్రలను సేకరించారు. ఈ సందర్భంగా గ్రామంలో మైక్‌ ద్వారా ముందస్తులు హెచ్చరికలు చేయించారు. పులి సంచారం నేపథ్యంలో దేవినేనివారిగూడెం, రామన్నగూడెం, చుట్టుపక్కల గ్రామస్తుల్లో ఒంటరిగా బయట తిరగొద్దని, పొలాలకు వెళ్లే వారు గుంపులుగా వెళ్లాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికై నా పులి, దాని జాడ కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా సర్కిల్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ డీఎఫ్‌వో త్రిమూర్తులరెడ్డి మాట్లాడుతూ పాదముద్రల ఆధారంగా పులి కదలికలను గుర్తిస్తున్నామని, దీనిని పట్టుకునేందుకు మూడు బృందాలతో గాలిస్తున్నట్టు తెలిపారు. పులి దాడిలో పశువులు గాయపడ్డా, మృతి చెందిన బాధిత రైతుకు నష్టపరిహారం అందిస్తామన్నారు. ఒకవేళ పులి కనిపిస్తే దాడులు చేయొద్దన్నారు. దాడులకు పాల్పడే వారిపై వైల్డ్‌ యానిమల్‌ యాక్ట్‌ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ముండూరులో పులి పాదముద్రల పరిశీలన

పెదవేగి/దెందులూరు: పెదవేగి మండలం ముండూరు, దెందులూరు మండలం మేదినవారిపాలెం గ్రామాల్లో పులి సంచారంపై ఆదివారం అటవీ అధికారులు పరిశీలన చేశారు. డీఎఫ్‌ఓ రవీంద్ర ధామ, వైల్డ్‌ లైఫ్‌ చీఫ్‌ వార్డెన్‌ ఏకే నాయక్‌, రాజమహేంద్రవరం ముఖ్య అటవీ సంరక్షణాధికారి వై.శ్రీనివాసరెడ్డి, రాజమహేంద్రవరం డీఎఫ్‌ఓ ఎ.త్రిమూర్తులు రెడ్డి ఈ గ్రామాల్లో పులి తిరిగిన ప్రదేశాలను తనిఖీ చేశారు. పులి కదలికలను గుర్తించేందుకు సమీప గ్రామాలలోని ప్రజలకు, పశువులకు హాని జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. పెరుగుగూడెంలో పాదముద్రలను పరిశీలించామని, అవి పెద్దపులివిగా ప్రాథమికంగా నిర్థారించామని జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రధామ వివరించారు. పెద్దపులి కదలికలపై సమాచారం తెలిస్తే అటవీశాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800–425–5909 కు తెలియజేయాలని కోరారు. సామాజిక మాధ్యమాలలో పులిపై వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు.

తోటలో కట్టి ఉన్న 2 ఆవులు, ఒక దూడపై దాడి

గ్రామంలో రైతులతో మాట్లాడిన అటవీ శాఖ అధికారులు

దేవినేనివారిగూడెంలో రైతులతో మాట్లాడుతున్న అటవీ అధికారులు  1
1/2

దేవినేనివారిగూడెంలో రైతులతో మాట్లాడుతున్న అటవీ అధికారులు

పులి దాడిలో గాయపడ్డ ఆవు  2
2/2

పులి దాడిలో గాయపడ్డ ఆవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement