
వెన్నుపోటుపై తిరుగుబాటు
చంద్రబాబు సర్కారు వెన్నుపోటు రాజకీయాలపై జనం తిరగబడ్డారు. ఏడాది పాలనలో చేసిందేమీ లేదంటూ ప్రజాగ్రహంతో కదంతొక్కారు. అధికారంలోకి రాగానే అద్భుతాలు చేస్తామని నమ్మించి ప్రజలను వంచించి మరీ ఓట్లు వేయించుకున్నారు. గద్దెనెక్కి ఏడాది గడిచినా ఒక్క పథకం అమలు చేయకపోగా కనీస అభివృద్ధి కూడా చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కూటమి ఏడాది పాలనలో పూర్తిగా విఫలమవడంతో బుధవారం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వెన్నపోటు దినం జిల్లాలో విజయవంతమైంది. ప్రజలకు హామీలిచ్చి వాటిని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వ తీరుపై పార్టీ ముఖ్యులు మండిపడ్డారు. సంక్షేమం, అభివృద్ధి విస్మరించి రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో దాడులు, దౌర్జన్యాల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలకు ముందుగా అనుమతులు తీసుకున్నా చివరి నిమిషంలో పోలీసులు అడ్డుకుని ప్రతి నియోజకవర్గంలో తీవ్ర అడ్డంకులు సృష్టించారు. బైక్ ర్యాలీలను అడ్డుకున్నా.. నిరసన పాదయాత్రలు మాత్రం నిలువరించలేకపోయారు. జిల్లాలోని కై కలూరు నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో జరిగిన నిరసన ర్యాలీలో పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఏలూరు నగరంలో పార్టీ ఇన్చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ నేతృత్వంలో జరిగిన భారీ నిరసన ర్యాలీలో పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా నిరసనలు
● ఏలూరు నియోజకవర్గంలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఫైర్స్టేషన్ సెంటరులో దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం డీఆర్ఓ పీ.విశ్వేశ్వరరావుకు వినతిపత్రం అందచేశారు. ఏలూరులో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి బైక్ ర్యాలీని నిలువరించారు. దీంతో పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా కలెక్టరేట్కు చేరుకున్నారు.
● కై కలూరు నియోజకవర్గంలోని కై కలూరులో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నాలుగు మండలాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీలో పాల్గొన్నాయి. జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఈ సారి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సంక్షేమాన్ని విస్మరించి రెడ్బుక్ పేరుతో కై కలూరు, దె ందులూరు, ఏలూరులో కూటమి శ్రేణులు అరాచకాలు సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
● నూజివీడు నియోజకవర్గం నూజివీడులోని ద్వారకా సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు 2 కిలోమీటర్ల మేర మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి మేకా ప్రతాప అప్పారావు, నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయ ఏఓ ఉదయభాస్కర్కు వినతిపత్రం అందించారు.
● పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి కూటమి తీరుపై ధ్వజమెత్తారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందచేశారు.
● ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు జాతీయ రహదారి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నియోజకవర్గ ఇన్చార్జి పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం వద్ద దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యులు గాదిరాజు సుబ్బరాజు పాల్గొన్నారు.
● చింతలపూడి నియోజకవర్గం చింతలపూడిలో నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు ఆధ్వర్యంలో మారుతీనగర్ నుంచి బోసు బొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్ళి ఫైర్స్టేషన్ సెంటరులో దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందించారు.
● దెందులూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఏలూరులోని దెందులూరు మాజీ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా పెదపాడు చేరుకుని తహసీల్దార్కు వినతిపత్రం అందచేశారు.
వెన్నుపోటుకు కేరాఫ్ చంద్రబాబు: డీఎన్నార్
కై కలూరు: వెన్నుపోటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేరాఫ్ అడ్రస్గా చరిత్రలో మిగిలిపోతారని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) విమర్శించారు. బుధవారం నిర్వహించిన వెన్నుపోటు దినంలో నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాలూకా సెంటర్లో డీఎన్నార్ మాట్లాడుతూ తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికీ రూ.15,000, ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు నిండితే నెలకు రూ.1500, ఉచిత బస్సు ప్రయాణం, 50 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీలకు పింఛన్, డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల రుణం, యువతకు రూ.3,000 నిరుద్యోగ భృతి, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, పంటలకు గిట్టుబాబు ధర ఇలా ఏదీ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. రూ.1,53,000 కోట్ల అప్పులు చేశారన్నారు. రేషన్ వాహనాలను తొలగించడం వల్ల రాష్ట్రంలో వేలాది మంది రేషన్ కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని, త్వరంలో ఇది తీవ్రరూపం దాలుస్తోందని చెప్పారు.
కూటమి ఏడాది పాలనపై పెల్లుబికిన ప్రజాగ్రహం
7 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిరసనల పర్వం
వెన్నుపోటు దినంలో కదంతొక్కిన పార్టీ శ్రేణులు, ప్రజలు
బైక్ ర్యాలీకి అనుమతి లేదంటూ అడుగడుగునా పోలీసుల అడ్డంకులు
పాదయాత్రగా నిరసన ర్యాలీలు