
పోడు భూముల పట్టాల కోసం ధర్నా
బుట్టాయగూడెం: పోడు వ్యవసాయం చేసే గిరిజనులకు పట్టాలివ్వాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం గిరిజనులు ధర్నా చేశారు. ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం జిల్లా నాయకులు ఎ.రవి మాట్లాడుతూ గిరిజనులు సాగు భూములకు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. అర్హులందరికీ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్కు వినతిపత్రం అందజేశారు. ఆందోళన కారులతోపాటు పీఓ కూడా కింద కూర్చుని వారి సమస్యలను విన్నారు. న్యాయం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరరావు, సీపీఎం నాయకురాలు మొడియం నాగమణి, తదితరులు పాల్గొన్నారు.