
రేషన్ కోసం పాట్లు
బుట్టాయగూడెం: కూటమి ప్రభుత్వం ఇంటి వద్దకు రేషన్ పంపిణీని రద్దు చేయడంతో మళ్లీ ప్రజలకు బియ్యం మోసే అవస్థలు మొదలయ్యాయి. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో కిలోమీటర్ల మేర కాలినడకన నడుచుకుంటూ బియ్యం మూటలను మోసుకుని తీసుకెళ్లాల్సి వస్తోంది. మండలంలోని మారుమూల గ్రామమైన రేగులపాటుకు చెందిన కొండరెడ్డి గిరిజనులు బుధవారం లంకపాకలలో ఏర్పాటు చేసిన రేషన్ డిపోకు వచ్చి పడిగాపులు కాచి రేషన్ బియ్యం మూటలను తలపై పెట్టుకుని తీసుకెళ్లారు. పలు గ్రామాలకు చెందిన ప్రజలు గత ప్రభుత్వంలో అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకటో తేదీనే ఎండీయూ వాహనాల్లో ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు అందించేవారంటున్నారు. పాత పద్దతి కొనసాగిస్తే గిరిజన ప్రజలకు మేలు జరుగుతుందని పనులు మానుకుని రేషన్ డిపోల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కారం రాఘవ అన్నారు.