రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొత్తపల్లి: నాగులపల్లి జంక్షన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం పట్టణం మిరపకాయల వీధికి చెందిన నాగమల్లి బాలసుబ్రమణ్యం (25) కెఎస్ఈజెడ్లో ఉన్న దేవి పిసరేష్ (రొయ్యల శుద్ధి పరిశ్రమ)లో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని నాగులపల్లి గ్రామం మీదుగా మోటార్ సైకిల్ పై పిఠాపురం వైపు వెళుతుండగా ఎండపల్లి నుంచి రమణక్కపేట వైపు వెళ్తున్న టాటా ఐషర్ వ్యాన్ నాగులపల్లి సెంటర్లో ఉన్న కనకదుర్గాదేవి ఆలయం సమీపంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతిచెందాడు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని..
యానాం: స్థానికంగా సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. యానాం పట్టణం మెట్టకూరు రమాభాయినగర్కు చెందిన దడాల యశోధరరావు (44) బైక్పై ద్రాక్షారామ దారిలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన రామచంద్రపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యానాం జీజీహెచ్కు తరలించినట్లు ఎస్సై తిరువక్కనరుసు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
సామర్లకోట: ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఎస్సై రాజా కథనం ప్రకారం.. స్థానిక 26వ వార్డు అయోధ్యరామాపురానికి చెందిన పల్లా దుర్గాప్రసాద్ మినీ వ్యాన్పై డ్రైవర్గా పని చేస్తున్నాడు. రోజూ మద్యం తాగి, భార్యతో ఘర్షణ పడి వేరే గదిలో నిద్రపోతూ ఉండేవాడు. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి కూడా మద్యం తాగి భార్య ప్రసన్నతో ఘర్షణ పడి ఆ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. సోమవారం ఉదయం 9 గంలు అవుతున్నా భర్త తలుపు తీయకపోవడంతో ప్రసన్న ఫోన్ చేసింది. అయినా స్పందన లేకపోవడంతో సమీపంలో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి చూడగా దుర్గాప్రసాద్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్సై వివరించారు.
ఈవోపై చర్యలు
తీసుకోవాలని ఫిర్యాదు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నాయీ బ్రాహ్మణులను కులం పేరుతో దూషించిన కోనసీమ జిల్లా అప్పన్నపల్లి బాలబాలాజీ దేవస్థానం ఈవో రాంబాబురెడ్డిపై చర్యలు తీసుకోవాలని ధన్వంతరి నాయీ బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సుందరపల్లి వీవీఎస్ గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా దేవదాయ శాఖ డీసీ కార్యాలయంలో అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న తలనీలాలు సమర్పించిన భక్తుని వద్ద మాట్లాడుతూ కుల వివక్షతో కూడిన పదజాలాన్ని వాడుతూ అవమానపరిచారన్నారు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాన్ని తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారన్నారు. ఒక బాధ్యతాయుతమైన అధికారి ఇలా ప్రవర్తించడం ఆక్షేపణీయమని ధ్వజమెత్తారు. కుల వివక్షకు పాల్పడిన ఈవోను తక్షణమే విధుల నుంచి తొలగించాలన్నారు. సామాజిక వర్గాన్ని కించపరిచే వీడియోను వైరల్ చేసిన సోషల్ మీడియా గ్రూపు అడ్మిన్పై చర్యలు తీసుకోవాలని ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేయనున్నటు చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా నాయీ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ర్యాలి లోవరాజు, జిల్లా నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ఎం నాగ సత్యనారాయణ, కాకినాడ సిటీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వేపాడ శ్రీనివాసరావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెదురుపావులూరి నాని, పాల్గొన్నారు.


