ప్రకాశంనగర్: 72వ జాతీయ కబడ్డీ పోటీలకు ఆంధ్ర కబడ్డీ జట్టు కెప్టెన్గా రాజమహేంద్రవరం నగరానికి చెందిన పిట్ట దుర్గారావు ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం స్థానిక అన్నపూర్ణమ్మపేటలో శ్రీస్వామి వివేకానంద మొబైల్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. క్లబ్ సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కబడ్డీ క్రీడాకారులు దుర్గారావును సత్కరించి, షీల్డ్ బహూకరించారు. సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఒక భాగం కావాలన్నారు. స్పోర్ట్స్ క్లబ్ సభ్యుడు మల్లిబాబు మాట్లాడుతూ దుర్గారావు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి, వివేకానంద స్పోర్ట్స్ క్లబ్కు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. వ్యాయామ ఉపాధ్యాయుడు సీరా గంగాధరం, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి బురిడి త్రిమూర్తులు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు నాగరాజు, కబడ్డీ క్రీడాకారులు వి.శ్రీనివాస్, ఎం.శ్రీనివాస్, కె.సత్తిబాబు, ఎస్.వీరబాబు, బి.ఏలియా, కె.వీర్రాజు, ఎస్.కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


