తాళ్లపూడి: పొలంలో గడ్డి కోయడానికి వెళ్లిన కౌలు రైతు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. కొవ్వూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణ పరిధిలోని నందమూరు రోడ్డులో ఆర్ఎస్ నెంబర్ 326 వరి చేను సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపడిపోయాయి. మండలం పశివేదల గ్రామానికి చెందిన కౌలు రైతు మట్టా శ్రీను (60) గడ్డి కోయడానికి గట్టు వెంబడి తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ వాటిపై కాలు వేయడంతో విద్యుదాఘాతానికి గురై ఎడమవైపు ఉన్న చేలో పడి మృతి చెందాడు. ఇంటి వద్ద నుంచి ఫోన్ చేయగా ఎంతకీ స్పందించకపోవడంతో అతని బావమరిది అయినాల ప్రసాద్ వరి చేలోకి వచ్చి చూడగా అతని మోటార్ సైకిల్ అక్కడ పెట్టి ఉండడం గమనించి చేలో మృతి చెంది ఉండడాన్ని గమనించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు శ్రీను ఇమ్మణి సాయికుమార్కు చెందిన పొలం కౌలుకు తీసుకుని చేస్తున్నారు. మృతుడికి భార్య, పిల్లలున్నారు. సీఐ విశ్వం సంఘటనా ప్రదేశంలో వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు.


