 
															టీచర్లకు టెట్ టెన్షన్
పిటిషన్ వేయాలి
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ను జాతీయ ఉపాధ్యాయ సంఘాలు వేశాయి. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విధాన ప్రకటన విడుదల చేయాలి. ఉపాధ్యాయులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
– పి.సురేష్కుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ
ప్రభుత్వం స్పష్టం చేయాలి
టెట్ నిర్వహణపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించాలి. సీనియర్ ఉపాధ్యాయులు టెట్ రాయడం సాధ్యం కాదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో టెట్ నిర్వహించడం సాధ్యం కాదని ఇప్పటికే తెలిపాయి. ఉపాధ్యాయుల తరఫున సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించాలి.
– పోతంశెట్టి దొరబాబు, ఎస్టీయూ జిల్లా
అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ
● అర్హత ఉండాలని స్పష్టం
చేసిన సుప్రీంకోర్టు
● పదోన్నతులకు తప్పనిసరి
చేస్తూ ఆదేశాలు
రాయవరం: ప్రభుత్వ ఉపాధ్యాయులను టెట్ టెన్షన్ పట్టుకుంది. ఐదేళ్లకు పైబడి సర్వీస్ ఉన్న టీచర్లు రెండేళ్లలోపు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)లో ఉత్తీర్ణులు కాని పక్షంలో ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు గత నెల 1న ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగడానికి, పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఐదేళ్ల సర్వీస్ ఉన్నవారు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలని పేర్కొంది. లేనిపక్షంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది.
ఉద్యోగ విరమణకు ఐదేళ్లలోపు సమయం ఉన్న టీచర్లకు మినహాయింపు ఇచ్చినప్పటికీ, వారు పదోన్నతుల కోసం టెట్ పాస్ కావాల్సి ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఆర్టీఐ–2010 నిబంధనల ప్రకారం టెట్ తప్పనిసరి చేయగా, ఉమ్మడి రాష్ట్రంలో 2012 డీఎస్సీలో ఈ నిబంధన అమలైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ, మండల/జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. జిల్లాలో 5,400 వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. 2010 ముందు చాలా మందికి టెట్ అర్హత లేదు. దాంతో తమకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం, విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది సీనియర్లు దశాబ్దాల తరబడి పాఠశాలల్లో బోఽధిస్తున్నారు. ఇప్పుడు వయసు, ఆరోగ్య సమస్యలు, ఇంటి బాధ్యతల వంటి కారణాలతో మళ్లీ పరీక్షకు సిద్ధమవ్వడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 10 వేల మంది వరకూ టెట్ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి.
చొరవ చూపాలి
ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాలు రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టెట్ అర్హతపై సడలింపులు లేదా ప్రత్యామ్నాయ పరిష్కారాలు అవసరమని ఒత్తిడి చేస్తున్నారు. ఎప్పుడో చదువుకున్న ఉపాధ్యాయులకు ఇప్పుడు టెట్ అర్హత చేయడం సరికాదంటున్నారు. గతంలో ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారమే తాము కొనసాగుతున్నామని చెబుతున్నారు.
 
							టీచర్లకు టెట్ టెన్షన్
 
							టీచర్లకు టెట్ టెన్షన్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
