 
															సేద తీరేందుకు రెడీ
● రత్నగిరిపై రూ.2.5 కోట్లతో విశ్రాంతి షెడ్డు
● నేడు ప్రారంభించనున్న అధికారులు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో పశ్చిమ రాజగోపురం వద్ద భక్తులకు విశ్రాంతి షెడ్డును శుక్రవారం ఉదయం ప్రారంభించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ‘లారెస్’ ఫార్మాస్యూటికల్ సంస్థ రూ.2.5 కోట్లతో ఈ షెడ్డును నిర్మించిన విషయం తెలిసిందే. గత నెల 3న ఈ నిర్మాణ పనులు ప్రారంభం కాగా 50 రోజుల వ్యవధిలోనే నిర్మించారు. సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల కోసం పశ్చిమ రాజగోపురం ముందు ఖాళీ ప్రదేశంలో సుమారు మూడు వేల మంది ఉండేలా సదుపాయాలు కల్పించారు. 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పున నిర్మించిన ఈ షెడ్డు చుట్టూ ఐదు అడుగుల మేర షేడ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తమంతా కలిపి సుమారు 10,625 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ షెడ్డులో వ్రతాలు, స్వామివారి దర్శనం, ప్రసాదం టిక్కెట్లు విక్రయించేందుకు వీలుగా 12 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వాటి ముందు స్టెయిన్లెస్ స్టీల్ క్యూ లైన్లు పెట్టారు. ఈ షెడ్డులో మూడు హెలికాఫ్టర్ (హై వాల్యూమ్ స్పీడ్) ఫ్యాన్లు, నలుగురు కూర్చునేలా 50 సెట్ల స్టీల్ కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా విశ్రాంతి షెడ్డు దిగువన మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు. శుక్రవారం ఈ షెడ్డును ప్రారంభిస్తారని ఈఈ రామకృష్ణ తెలిపారు.
‘సాక్షి’ చొరవతో వేగం
సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులకు పశ్చిమ రాజగోపురం వద్ద నిలువ నీడ లేని విషయాన్ని పలుమార్లు ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు వచ్చాయి. దీంతో అధికారులు స్పందించారు. ఈ షెడ్డు నిర్మించే ఉద్దేశంతో ఈ స్థలంలో ఉన్న సత్యదేవ వీఐపీ సత్రాన్ని 2023లో కూల్చేశారు. అప్పటి ఈఓ చంద్రశేఖర్ అజాద్ కృషి మేరకు 2023 నవంబర్లో లారెస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రతినిధులు పైకప్పు రేకులతో ఉండేలా విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఈఓ బదిలీ కావడంతో ఇది ఆలస్యమైంది. దీంతో పశ్చిమ రాజగోపురం వద్ద నీడ లేక భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ‘సాక్షి’ దినపత్రికలో పలుమార్లు కథనాలు వచ్చాయి. స్పందించిన అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ 2024లో లారెస్ ప్రతినిధులతో మాట్లాడి రేకుల షెడ్డుకు బదులు తెల్లని ‘టెన్సిల్’ క్లాత్తో షెడ్డు వేయడానికి నిర్ణయించారు. ఆ తరువాత కూడా ఆలస్యమవడంతో జూలై నాలుగో తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘నిలువ నీడేదీ!’ అనే శీర్షికన కథనం రావడతో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈ రామకృష్ణ షెడ్డు నిర్మాణంపై జరుగుతున్న జాప్యంపై చర్చించి త్వరగా నిర్మించాలని కోరారు. దీంతో గత నెల 3న పనులు ప్రారంభించి షెడ్డు నిర్మాణం పూర్తి చేశారు.
 
							సేద తీరేందుకు రెడీ
 
							సేద తీరేందుకు రెడీ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
