
విశ్వాసం నిలబెట్టుకోలేకపోయారు
దేవరపల్లి: రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. నల్లజర్లలో పార్టీ మండల కార్యాలయం వద్ద ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో చట్టాలను అమలు చేయవలసిన వ్యవస్థలను ప్రభుత్వ పెద్దలు తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. చట్టాల్ని ఉల్లంఘించడానికే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు మీడియాపై, మరోవైపు ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని, అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. రైతులను ప్రభుత్వం నిలువునా ముంచిందని విమర్శించారు. పెట్టుబడి సాయం లేదని, పంటల బీమా సౌకర్యం లేక, గిట్టుబాటు ధరలు రాక రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారని అన్నారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో వ్యవసాయం భారంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం, కోకో, ఆయిల్పామ్, పొగాకు వంటి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వారికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా ఉండి, సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని చెప్పారు. రాష్ట్రం మద్యాంధ్రప్రదేశ్గా మారడంతో ముక్కుపచ్చలారని చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఎక్కువగా జరుగున్నాయని వేణు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలపై 185 అత్యాచారాలు జరగగా, వీటిలో 27 హత్యలు జరిగాయని తెలిపారు. తల్లికి వందనం సాయం అందించకుండా పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందన్నారు. విద్యారంగాన్ని విధ్వంసం చేశారన్నారు. ఇటువంటి ప్రజా సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాలకులందరూ బంజరు భూములను సాగులోకి తెచ్చి పంట భూములుగా మార్చ గా, సీఎం చంద్రబాబు పట్టుదలకు పోయి మూడు పంటలు పండే భూముల్లో అమరావతి నిర్మాణం చేపట్టారని విమర్శించారు. అమరావతి భూములను వ్యాపార భూములుగా మార్చారని అన్నారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పని తీరుపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని వేణు అన్నారు. విలేకర్ల సమావేశంలో రాష్ట్ర మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రమణ్యం, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బంకా అప్పారావు పాల్గొన్నారు.
ఫ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు
ఫ రెడ్ బుక్ రాజ్యాంగంతో
కక్షసాధింపు చర్యలు
ఫ కూటమి ప్రభుత్వ పనితీరుపై
విస్తృత చర్చ జరగాలి
ఫ వైఎస్సార్ సీపీ జిల్లా
అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు