అఘాయిత్యాలపై స్పందించరేం..? | - | Sakshi
Sakshi News home page

అఘాయిత్యాలపై స్పందించరేం..?

Jun 11 2025 8:52 AM | Updated on Jun 11 2025 8:52 AM

అఘాయిత్యాలపై స్పందించరేం..?

అఘాయిత్యాలపై స్పందించరేం..?

దేవరపల్లి: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, బాలికలు, యువతులు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నప్పటికీ హోం మంత్రి వంగలపూడి అనిత కనీసం స్పందించిన దాఖలాల్లేవని రాష్ట్ర మాజీ హో మంత్రి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత విమర్శించారు. నల్లజర్లలో పార్టీ మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద ఆమె విలేకర్లతో మాట్లాడారు. అనంతపురం జిల్లాలో ఇంటర్‌ విద్యార్థిని తన్మయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. వారం రోజులు గడిచినా పోలీసులు స్పందించలేదన్నారు. నాడు అదృశ్యమైన తన్మయి ఆదివారం శవమై కనిపించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆమె గురించి హోం మంత్రి అనిత ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమని విమర్శించారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో బాలికపై టీడీపీ కార్యకర్త అత్యాచార యత్నానికి ఒడిగట్టాడని, బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఇంతవరకూ సాయం అందించలేదని వనిత ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో ఒక యువతిని ఆరు నెలలుగా ఏడుగురు యువకులు ఇంట్లో బంధించి లైంగిక దాడికి పాల్పడినా, విషయం పోలీస్‌ స్టేషన్‌ వరకూ వెళ్లినా కేసు నమోదు చేయని విషయం అనితకు కనిపించడం లేదని మండిపడ్డారు. ఎంతసేపూ వైఎస్‌ జగన్‌ను, భారతిని తిట్టడం తప్ప వేరే పని లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి అనిత పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. వీటిపై ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు బనాయించి, జైల్లో పెడుతున్నారన్నారు. జర్నలిస్టు కృష్ణంరాజు మహిళలపై చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌ సీపీ, మహిళల తరఫున ఖండిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ వాటిని తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, భారతికి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి గురించి వంగలపూడి అనిత ఎన్నో అన్నారని, అలా మాట్లా డాలని చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, లోకేష్‌ చెప్పా రా అని వనిత ప్రశ్నించారు. కొమ్మినేని, కృష్ణంరాజు వ్యాఖ్య ల గురించి వైఎస్‌ జగన్‌ క్షమాపణ చెప్పాలని అనిత అంటున్నారని, విజయమ్మ, భారతి గురించి మాట్లాడిన మాటలపై ముందు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో చిన్నారులు, యువతులు, మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేసి, బాధితులకు అండగా నిలబడాలని సూచించారు. బాధితులను పరామర్శించడం లేదని, ప్రభుత్వం నుంచి కనీస సాయం అందించడం లేదని, డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర లేపుతూ వైఎస్‌ జగన్‌, సాక్షి చానల్‌, చానల్‌ అధినేత భారతి గురించి తప్పుడుగా మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. జగన్‌ గురించి అనితకు ఏం తెలుసని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో మహిళలకు జగన్‌ ఇచ్చినంత గౌరవం ఏ సీఎం ఇవ్వలేదన్నారు. మహిళలంతా మహరాణులుగా ఉండాలని అమ్మ ఒడి, చేయూత, ఆసరా, ఇళ్ల స్థలాలు, ఇళ్లు వంటి 11 పథకాలను మహిళల పేరిట అందించారని గుర్తు చేశారు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం మహిళలకు ఇచ్చారని వనిత చెప్పారు. జగన్‌ గురించి మాట్లాడే అర్హత మంత్రి అనితకు లేదని అన్నారు. విలేకర్ల సమావేశంలో పార్టీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు యజ్జవరపు లక్ష్మి, నియోజకవర్గ కార్మిక విభాగం అధ్యక్షుడు మద్దూరి నాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు బంకా అప్పారావు, మేన్నీ కృష్ణ చౌదరి పాల్గొన్నారు.

ఫ డైవర్షన్‌ రాజకీయాలకు తెర లేపుతారా?

ఫ హోం మంత్రి అనితపై

మాజీ హోం మంత్రి వనిత విమర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement