
జిల్లావ్యాప్తంగా 4 లక్షల మొక్కలు నాటుతాం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా 4 లక్షల మొక్కలు నాటుతామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యాన స్థానిక ఆర్ట్స్ కళాశాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాటిన మొక్కలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కోరారు. ప్లాస్టిక్ మంచిది కాదనే విషయం తెలిసిన రోజున ఎవరికి వారే దీని వినియోగం తగ్గించుకోవడం సాధ్యమవుతుందని అన్నారు. అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటర్ మూర్తి మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగంతో మనకు తెలియకుండానే శరీరంలో మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు రక్తంలో కలిసిపోతున్నాయని తెలిపారు. వెయ్యి మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 80 శాతం మందిలో మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు గమనించారన్నారు. మైక్రో ప్లాస్టిక్ ఉన్న వారిలో 25 శాతం మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సెంట్రల్ జైలును సందర్శించిన
అటవీ అధికారులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలును అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఎస్ఎన్ఎన్ మూర్తి, డివిజనల్ ఫారెస్ట్ అధికారి ఫణీంద్ర ధర్మ గురువారం సందర్శించారు. జైలులోని నర్సరీ గురించి వారికి కారాగార పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్ వివరించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కారాగారానికి బయో డైవర్సిటీ పురస్కారం అందజేసిందని చెప్పారు. వందేళ్ల వయస్సుకు పైబడిన వృక్షాలను అటవీ శాఖ అధికారులకు ఆయన చూపించారు. కారాగారంలో నర్సరీని అభివృద్ధి చేసిన జైలు అధికారులను అటవీ అధికారులు ప్రశంసించారు. అనంతరం కారాగారంలోని పరేడ్ మైదానంలో మొక్కలు నాటారు.
కార్మిక శాఖ సహాయ కమిషనర్గా
శ్రీనివాస్ మహేష్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కార్మిక శాఖ కాకినాడ సహాయ కమిషనర్గా పి.శ్రీనివాస్ మహేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో కార్మిక శాఖ కమిషనర్గా పని చేస్తున్న ఆయన బదిలీపై కాకినాడ వచ్చారు. ఇప్పటి వరకూ ఇక్కడ పని చేసిన ఎస్.బుల్లిరాణి కొవ్వూరు బదిలీ అయ్యారు.

జిల్లావ్యాప్తంగా 4 లక్షల మొక్కలు నాటుతాం