
జీజీయూలో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు
రాజానగరం: ఆస్ట్రేలియాలోని మెక్వెరీ యూనివర్సిటీ, ప్రముఖ సంస్థ కేపీఎంజీ ఇండియాలతో స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) అవగాహన ఒప్పందాలు చేసుకుంది. దీనికి సంబంధించిన పత్రాలను యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రొ.ఛాన్సలర్ కె.శశికిరణ్వర్మ, కేపీజీఎం ఇండియా ప్రతినిధి నారాయణ్ రామస్వామి సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా జీజీయూ ఛాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో బోధన అందించేందుకు జీజీయూ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ప్రొ.ఛాన్సలర్ శశికిరణ్వర్మ మాట్లాడుతూ, ఈ ఒప్పందం ద్వారా బీటెక్లో సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ చేసేందుకు అవకాశాలుంటాయన్నారు. కేపీజీఎం ఇండియా ప్రతినిధి నారాయణ్ రామస్వామి మాట్లాడుతూ, జీజీయూతో కలిసి పని చేయడం ద్వారా విద్యార్థులకు చక్కటి భవితను అందించే అవకాశం లభించిందన్నారు. మెక్వెరీ యూనివర్సిటీ సైబర్ స్కిల్ అకాడమీ సీఈఓ మాట్ బుష్బై ఆన్లైన్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేపీఎంజీ ఇండియా ప్రతినిధులు మహావీర్, రాఘవన్ ఎస్., జీజీయూ సాంకేతిక సలహాదారు సుమంత్, వీసీ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
డీఐపీఆర్ఓగా లక్ష్మీనారాయణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సమాచార, పౌర సంబంధాల అధికారి(డీఐపీఆర్ఓ)గా కె.లక్ష్మీనారాయణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతిని ఆమె క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లా కావలి మండలానికి చెందిన లక్ష్మీనారాయణ 2020 జనవరిలో ఏపీపీఎస్సీ ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉప సమాచార ఈఈగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. జిల్లాల పునర్విభజన అనంతరం బదిలీపై అమలాపురంలో డీఐపీఆర్ఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం భాగంగా రాజమహేంద్రవరానికి బదిలీ అయ్యారు. లక్ష్మీనారాయణకు జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్ఓ టి.సీతారామమూర్తి, బదిలీపై వెళ్తున్న డీఐపీఆర్ఓ సీహెచ్ శ్రీనివాస్, తదితరులు అభినందనలు తెలిపారు.

జీజీయూలో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు