
సేవలకు సెలవంటూ...
ఉత్తరాధికారి రాఖీ
ప్రేమ్ తదుపరి పీఠాధిపతి
పీఠాధిపతి కామేశ మహర్షి శివైక్యం కావడంతో ప్రస్తుతం పీఠం ఉత్తరాధికారిగా ఉన్న బాల బ్రహ్మచారి వికానస రాఖీ ప్రేమ్ను తదుపరి పీఠాధిపతిని చేసేందుకు కామాక్షీ పీఠం ట్రస్ట్ బోర్డు నిర్ణయానికి వచ్చింది. ఇంత కాలం పీఠం ట్రస్ట్కు అధిపతిగా ఉన్న కామేశ మహర్షి స్థానే ప్రేమ మందిరం అమ్మ, వరసకు ఆయన సోదరి వక్కలంక వాణి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రేమ మందిరంలో పెరిగి పెద్ద అయిన, పీఠాధిపతి ప్రియశిష్యుడు మర్రి దుర్గారావు ఎప్పటిలాగే పీఠం మేనేజర్ బాధ్యతలు నిర్వహిస్తారు.
అమలాపురం టౌన్: శ్రీకామాక్షీ పీఠాధిపతి కామేశ మహర్షి (88) సేవా ప్రస్థానం ముగిసింది. మానవ సేవే మాధవ సేవ అనే భావనతో ఆయన జీవితాంతం నడిచారు. పీఠాధిపతి అస్తమించారన్న వార్త కోనసీమ ప్రజలను విషాదంలో నింపింది. ఆరు నెలలుగా అస్వస్థతగా ఉన్న ఆయన గురువారం తెల్లవారు జాము 3.30 గంటలకు పీఠంలోనే తుది శ్వాస విడిచారు. పీఠాధిపతి ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండి సమాజానికి సేవలు అందించారు. ఈయన స్వగ్రామం తుని సమీపంలోని హంసవరమైనప్పటికీ అమలాపురంలో పుట్టి పెరగడంతో పట్టణంలోనే పీఠాన్ని ఏర్పాటు చేశారు. 1938 ఏప్రిల్ 2న జన్మించారు. అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలలో డిగ్రీ, మద్రాసు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీలో ఏఎంఐఈ చదివారు. ఈయన అసలు పేరు బెహరా యర్రంరాజు. పీఠాధిపతి అయ్యాక కామేశ మహర్షి అయ్యారు.
1967లో పీఠం ఏర్పాటు
అమలాపురంలోని కృష్ణారావు వీధిలో శ్రీకామాక్షీ పీఠాన్ని 1967లో స్థాపించారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్ర సరస్వతీ స్వామి అనుగ్రహం, ఆశీస్సులతో కామేశ మహర్షి పీఠాధిపతి అయ్యారు. కామేశ మహర్షి కంచి కామకోటి పీఠానికి అనేక సార్లు వెళ్లడమే కాకుండా జయేంద్ర సరస్వతీ స్వామీజీని అమలాపురం పీఠానికి 1976, 1996 సంవత్సరాల్లో తీసుకుని వచ్చారు. రెండేళ్ల కిందట కంచి కామకోటి పీఠాఽధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామీజీని పీఠానికి తోడ్కొని వచ్చి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ పీఠాధిపతుల ఆశీర్వాదాలతోనే కామాక్షీ పీఠం ప్రస్థానం సాగింది. కామాక్షీ పీఠం ట్రస్ట్ను స్థాపించి కార్యవర్గం ఆధ్వర్యంలో సేవలు కొనసాగించారు.
అనాథ పిల్లల కోసం ప్రేమ మందిరం
1996 సంవత్సరంలో పెను తుపానుతో కోనసీమలో ప్రాణ నష్టం భారీగా జరిగింది. తుపానులో వందలాది మంది మృత్యువాత పడినప్పుడు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలను చూసి పీఠాధిపతి చలించారు. ఈ క్రమంలో అదే సంవత్సరం పీఠంలోనే అనాథ పిల్లల ఆశ్రమం పేరుతో ప్రేమ మందిరం నెలకొల్పారు. వరసకు సోదరి అయిన వక్కలంక వాణికి ఆ ప్రేమ మందిరం అమ్మగా బాధ్యతలు అప్పగించారు. కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమ మందిరం అమ్మ వాణి అనాథలను చూసుకుంటున్నారు. ఇన్నేళ్లలో ప్రేమ మందిరంలో దాదాపు 600 మంది అనాథ పిల్లలు ఆశ్రమం పొందారు. అనాథ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి వారు ప్రయోజకులు అయ్యేలా చేశారు. సుమారు 50 అనాథ ఆడ పిల్లలకు యుక్త వయస్సు వచ్చాక పెళ్లిళ్లు చేసి మెట్టింటికి పంపించారు. ప్రస్తుతం 60 మంది అనాథలు ఆశ్రయం పొందుతున్నారు.
సేవలు అనంతం
కామేశ మహర్షి ఇటు పీఠంలోనే కాకుండా అనేక గ్రామాల్లో తన సేవలను కొనసాగించారు. పీఠంలో నిత్యం పూజాదికాలు నిర్వహించారు. కార్తిక, శ్రావణ, మాఘ మాసాల్లో మహిళలతో సామూహిక పూజలు చేయించేవారు. అన్నదానం అంటే ఆయనకు అమితమైన ఇష్టం. గ్రామాల్లో అనేక అన్నదానాలు నిర్వహించారు. అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి గ్రామంలో గోశాలను నెలకొల్పి 60 గోవులకు ఆశ్రయం కల్పించారు. తుని సమీపంలోని హంసవరంలో శ్రీకామాక్షీ ఆలయాన్ని, అమలాపురం రూరల్ మండలం చిందాడగరువులో అమలేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. దానికి అనుబంధంగా చిందాడ మడుగులో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేశారు.
ఎన్నెన్నో పురస్కారాలు
కామేశ మహర్షి తన సేవా ప్రస్థానంలో పలు సంస్థల నుంచి ఎన్నెన్నో పురస్కారాలు అందుకున్నారు. మద్రాసు అకాడమి నుంచి ఉగాది పురస్కారం, రాజీవ్ విజ్ఞాన్ పురస్కారం, అల్లూరి స్మారక పురస్కారం, సహస్రాబ్ది పురస్కారం, శతాబ్ది సేవా పురస్కారం, ఎన్టీఆర్ స్మారక ట్రస్ట్ నుంచి జాతీయ పురస్కారం, అక్షర నీరాజన పురస్కారం, ప్రభుత్వం నుంచి సేవా పురస్కారాలను అందుకున్నారు.
నేడు అంత్యక్రియలు
కామేశ మహర్షి పార్థివ దేహానికి పీఠంలోనే శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించేందుకు పీఠం ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. కామేశ మహర్షి జీవించి ఉండగానే తన అంత్యక్రియలు పీఠంలోనే జరగాలని ప్రదేశాన్ని కూడా సూచించారు. ఆయన సూచనల మేరకే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీకామాక్షీ పీఠాధిపతి కామేశ మహర్షి అస్తమయంతో కోనసీమలో విషాదం
అనాథలను అక్కున చేర్చుకున్న
మానవతావాది
అన్నార్తుల ఆకలి తీర్చిన దాన శీలి
చిందాడగరువు,
హంసవరలో ఆలయాల నిర్మాణం
పీఠంలో నిత్యం పూజా కార్యక్రమాలు
మూడు పర్యాయాలు కంచి కామకోటి
పీఠాధిపతులు అమలాపురానికి రాక

సేవలకు సెలవంటూ...

సేవలకు సెలవంటూ...