
రాష్ట్రంలో సాగుతున్న కక్షపూరిత పాలన
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో కేవలం కక్షపూరిత పాలన మాత్రమే సాగుతోందని, సంక్షేమం అంటూ ఏమీ లేదని వైఎస్సార్ సీపీ మేధావుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వై.ఈశ్వర్ప్రసాద్రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ మేధావుల విభాగం నియోజకవర్గ అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ, అమలు చేయలేమని తెలిసీ, అధికార దాహంతో బూటకపు హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంతో గుణపాఠం చెప్పారన్నారు. ప్రజలంతా చంద్రబాబు మనస్తత్వం ఏమిటో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వం ఎటువంటిదో తెలుసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అన్యాయాలు, అక్రమాలతో పాటు, ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు, 143 హామీలను అమలుచేయని విషయాన్ని ప్రజల్లో తీసుకువెళ్లాలన్నారు. వైఎస్సార్ సీపీ బలోపేతానికి మేధావుల విభాగం పూర్తి స్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, పార్టీ మేధావుల విభాగం ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి సహాయసహకారాలు అందిస్తానన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్వీఎస్ రెడ్డి, రొక్కం సంజీవయ్య, రాఘవరెడ్డి, కాకినాడ జిల్లా అధ్యక్షుడు పార్థసారధి, నియోజకవర్గ అధ్యక్షులు కర్రిశ్రీను, భీమేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ మేధావుల విభాగం
రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ప్రసాద్రెడ్డి