నడిరోడ్డుపై పోలీసుల థర్డ్‌ డిగ్రీ | - | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై పోలీసుల థర్డ్‌ డిగ్రీ

Jun 3 2025 12:29 AM | Updated on Jun 3 2025 12:29 AM

నడిరోడ్డుపై పోలీసుల థర్డ్‌ డిగ్రీ

నడిరోడ్డుపై పోలీసుల థర్డ్‌ డిగ్రీ

రెడ్‌ బుక్‌ రాజ్యాంగానికిదే నిదర్శనం

మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): తెనాలిలో నడిరోడ్డుపై యువకులపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడమే ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగానికి నిదర్శనమని మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జూన్‌ 4న నిర్వహించనున్న వెన్నుపోటు దినం పోస్టర్‌ను రాజమహేంద్రవరం వీఎల్‌ పురంలోని మార్గాని ఎస్టేట్స్‌ వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇది రెడ్‌ బుక్కా,.. బ్లడ్‌ బుక్కా అని జాతీయ మీడియాలో ఏపీ గురించి అడుగుతున్నారని అన్నారు. నేరం చేసిన వారిని శిక్షించడానికి న్యాయస్థానాలుండగా, పోలీసులే ఇలా వ్యవహరిస్తే ఇక ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అని నిలదీశారు. తెనాలిలో యువకులను పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో కొట్టిన ఘటన మరువక ముందే అదే పట్టణంలో ఒక గోల్డ్‌ స్మిత్‌ కూడా వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు దారుణంగా ఉన్నాయన్నారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమేమిటని, అలాగైతే ఇక కోర్టులెందుకని భరత్‌రామ్‌ ప్రశ్నించారు. నిజంగా తప్పు చేస్తే కోర్టులో నిరూపించి, అవసరమైతే ఉరి శిక్ష వేయవచ్చని, అంతే కానీ, ఇలా రోడ్డు మీద చిత్రవధ చేయడమేమిటని నిలదీశారు.

డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి..

ఇవ్వక ఇవ్వక ఇన్నాళ్లకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారని, ఐదు లక్షల మంది పరీక్షలు రాయబోతున్నారని, వారు కనీసం 90 రోజుల సమయం అడిగితే, 40 రోజుల్లోనే పరీక్ష పెట్టేస్తే ఎలాగని భరత్‌రామ్‌ ప్రశ్నించారు. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆశావహులు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారని, సమయం ఇవ్వకపోతే వారు పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. డీఎస్సీ అభ్యర్థులకు మూడు నెలల సమయం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ హామీలు అంటూ ఊదరగొట్టారని, అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా అమలు చేయకపోవడంతో ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరని అన్నారు. ప్రజలను నమ్మించి, వంచించి అధికారం పీఠం ఎక్కారని విమర్శించారు. అందుకే జూన్‌ 4న వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం నిర్వహించనున్నామని ఆయన చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement