
ఘనంగా జన్మనక్షత్ర పూజలు
అన్నవరం: సత్యదేవుని జన్మనక్షత్రం మఖను పురస్కరించుకుని స్వామి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆలయం తెరచి స్వామి, అమ్మవార్లకు అర్చకులు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్లకు, శివలింగానికి పంచామృతాలతో మహన్యాస పూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం సుగంధభరిత పుష్పాలతో స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాగశాలలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ సత్యదేవుడు, అమ్మవార్లకు ఆయుష్య హోమం నిర్వహించారు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుడు, అమ్మవారు, శంకరులను ముత్యాల కవచాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.