దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

May 4 2025 6:52 AM | Updated on May 4 2025 6:52 AM

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం

వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతల హెచ్చరిక

అనపర్తి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి మద్దతుగా ఎస్పీకి ఫిర్యాదు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డిపై దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టేందుకు వెనుకాడేది లేదని వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతలు హెచ్చరించారు. ఈ మేరకు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌కు మాజీ మంత్రులు, పార్టీ తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు వేణు, రాజా మీడియాతో మాట్లాడారు. పెదపూడి మండలం దోమాడ గ్రామంలో కూటమి నాయకుడి లే అవుట్‌కు అడ్డుగా ఉన్నాయనే ఉద్దేశంతో మూడు దశాబ్దాలుగా పాకలు వేసుకుని జీవిస్తున్న నిరుపేదలను బలవంతంగా ఖాళీ చేయించారన్నారు. దీనిని ప్రశ్నించి, బాధితులకు అండగా నిలవడం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి చేసిన తప్పా అని వారు ప్రశ్నించారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండదండలతో కూటమి నేతలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అనేది ఆత్మావలోకనం చేసుకోవాలని హితవు పలికారు. దోమాడలో నిరాశ్రయులైనవారిని ఆదుకునేందుకు వెళ్లి, నిత్యావసరాలు అందించి, తిరిగి వస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డిని రెండుచోట్ల అడ్డగించి, దౌర్జన్యాలకు పాల్పడ్డారని చెప్పారు. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ప్రాంతంలో ఫ్యాక్షన్‌ సంస్కృతి తీసుకువస్తారా అని నిలదీశారు.

ఈ దౌర్జన్యానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెదపూడి పోలీసు స్టేషన్‌లో డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి ఫిర్యాదు చేసినా పోలీసులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి, చట్ట ప్రకారం కేసు నమోదు చేసి, తక్షణం అరెస్టు చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. తమ విజ్ఞప్తికి ఎస్పీ బిందుమాధవ్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఎస్పీపై నమ్మకం ఉందని, బాధ్యులపై చర్యల కోసం ఎదురు చూస్తూంటామని చెప్పారు. ఎస్పీని కలిసిన వారిలో పార్టీ అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ అద్దంకి ముక్తేశ్వరరావు, సుంకర విద్యాసాగర్‌, పార్టీ కాకినాడ సిటీ యూత్‌ అధ్యక్షుడు రోకళ్ల సత్య, పృథ్వీరాజ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement