రాజమహేంద్రవరం రూరల్: ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆమె, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడుతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల నియమావళి పూర్తయినందున వివిధ స్థాయిల్లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను హేతుబద్ధతతో పరిష్కారం చూపాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని పరిష్కరించాలన్నారు. స్వయంగా కలిసిన వివరాలు ఎప్పటికప్పుడు పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఆన్లైన్ లో ఉన్నతాధికారుల ద్వారా వచ్చిన 285 అర్జీలు పరిష్కారం చెయ్యాల్సి ఉందన్నారు. పోలీస్ 61, విద్యుత్ 31, రెవెన్యూ 65, పంచాయతీరాజ్ 28, వ్యవసాయ శాఖకు సంబంధించి 6 ఉన్నాయన్నారు. క్షేత్ర స్థాయిలో పరిష్కారం అయ్యే అర్జీలు జిల్లా కేంద్రానికి రావడం, ఒకే ఫిర్యాదు పలుసార్లు రావడం గుర్తించామన్నారు. భూములు, సర్వే, విభజన, మ్యుటేషన్, వితంతు, వృద్దాప్య, దివ్యాంగుల పెన్షన్ల కోసం, రేషన్ కార్డులు తదితర అంశాలపై అర్జీలు వస్తున్నాయని, సచివాలయం స్థాయిలో వివరాలు నమోదు చేసి అర్జీదారునికి వివరించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి వారికి తెలియజేయ్యాల్సి ఉంటుందన్నారు.
దివ్యాంగులకు 3 వీల్ చైర్స్,
10 హియరింగ్ ఎయిడ్స్ పంపిణీ
పీజీఆర్ఎస్లో జిల్లా ప్రత్యేక అవసరాల, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడు వీల్ చైర్స్, 10 వినికిడి యంత్ర పరికరాలను కలెక్టర్ ప్రశాంతి, జేసీ చిన్న రాముడు అందజేశారు. జిల్లా రెవిన్యూ అధికారి టి.సీతారామమూర్తి, బీఎస్పీ భవ్యకిషోర్, సీపీవో అప్పలకొండ, డీఎల్డీవో పి.వీణాదేవి పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రశాంతి