
అన్నవరం: రత్నగిరి ఆదివారం జనసంద్రమే అయ్యింది. తెల్లవారుజాము నుంచీ వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, దర్శనం క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారి ఆలయాన్ని తెల్లవారుజామున మూడు గంటలకు తెరచి సత్యదేవునికి పూజలు చేశారు. అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. వ్రతాలు కూడా వేకువజామున మూడు గంటలకే ప్రారంభించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకూ దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశారు. అందరినీ వెలుపల నుంచే అనుమతించారు. యంత్రాలయంలో కూడా ప్రదక్షిణ దర్శనాలు నిలిపివేశారు. సుమారు 80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి, పూజలు చేశారు. వ్రతాలు 8 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.80 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. అన్నదాన పథకంలో 10 వేల మంది భక్తులకు భోజనం పెట్టారు. కార్తిక మాసం ఆఖరి సోమవారం కావడంతో రత్నగిరిపై నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగనుంది. భక్తులు భారీగా తరలి వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే సత్యదేవుని వ్రతాలు, దర్శనాలకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రత్నగిరిపై అనివేటి మండపంలో సహస్ర జ్యోతిర్లింగార్చన నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకూ 1.18 లక్షల వ్రతాలు
ప్రస్తుత కార్తిక మాసంలో ఇప్పటి వరకూ సత్యదేవుని వ్రతాలు 1.18 లక్షలు జరిగాయి. గత ఏడాది ఇదే రోజుకు 1,41,647 వ్రతాలు జరిగాయి. ఈ ఏడాది సుమారు 23 వేల వ్రతాలు తక్కువగా జరిగాయి. మంగళవారంతో కార్తిక మాసం ముగియనుంది.
రద్దీగా కోటసత్తెమ్మ తల్లి సన్నిధి
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేలాదిగా వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. దర్శనాలు, ప్రసాదం, పూజా టిక్కెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా అమ్మవారికి రూ.75,100 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ బళ్ల నీలకంఠం (శివ) తెలిపారు.
శ్రీపీఠం.. అరుణారుణం
● 103 కోట్లకు చేరిన కుంకుమార్చనలు
● మహాశక్తి యాగం విజయవంతం
కాకినాడ రూరల్: పవిత్ర కార్తిక మాసంలో కాకినాడ రమణయ్యపేటలోని శ్రీపీఠం అరుణారుణ కాంతులను అద్దుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకే వేదికపై వేలాది మంది మహిళలు లలితా సహస్ర నామాలతో చేసిన శతకోటి కుంకుమార్చనలు.. పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి పట్టుదల, దీక్షతో సంపూర్ణమయ్యాయి. వంద కోట్ల లలితా కుంకుమార్చనలు విజయవంతంగా జరగడమే కాదు.. ఏకంగా 103 కోట్లు పూర్తయ్యాయి. మహాశక్తి యాగంలో 27వ రోజైన ఆదివారం ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. గత నెల 14న కార్తిక మాసం తొలి రోజున ఇక్కడ ఈ మహాశక్తి యాగం ప్రారంభమైంది. ప్రతి రోజూ నక్షత్ర శాంతి పూజలు, లలితా సహస్ర నామాలతో కుంకుమార్చనలు, సాయంత్రం కోటి దీపోత్సవం, రాత్రి బగళాముఖి హోమం, రుద్ర యాగం నిర్వహించారు. ఈ మహత్తర మహాశక్తి యాగం బుధవారం పరిసమాప్తి కానుంది. అకాల మృత్యు నివారణకు, ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు ఈ యాగం తలపెట్టానని పరిపూర్ణానంద స్వామి చెప్పారు. ప్రతి ఒక్కరూ లలితా అమ్మవారిపై భారం వేసి, జీవితాన్ని పండించుకోవాలని సూచించారు. అమ్మ అనే అనుభూతిని పొందుతూ ప్రతి రోజూ 24 నిమిషాలు అమ్మవారికి కేటాయించి, లలితా సహస్ర నామాలు పఠించాలని చెప్పారు.
ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ

లలితా సహస్ర నామార్చన చేయిస్తున్న పరిపూర్ణానంద స్వామి