జీడిపండు.. పోషకాలు మెండు | - | Sakshi
Sakshi News home page

జీడిపండు.. పోషకాలు మెండు

May 14 2023 11:54 PM | Updated on May 14 2023 11:54 PM

కలవచర్ల కేవీకేలో మహిళలకు జీడిమామిడి పండ్ల వినియోగంపై శిక్షణ
 - Sakshi

కలవచర్ల కేవీకేలో మహిళలకు జీడిమామిడి పండ్ల వినియోగంపై శిక్షణ

రాజానగరం: మెట్ట ప్రాంతంలో రైతులకు అధిక ఆదాయం సమకూర్చే పంటలలో జీడిమామిడి ప్రధానమైనది. వేసవి పంటగా ఫలసాయాన్ని, ప్రభుత్వాలకు విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తున్న ఈ పంటలో ఆదాయ వనరులు జీడిగింజలే. అందుకనే దేశంలో జీడిమామిడి సాగు ఎక్కువగా జీడిగింజల కోసమే అన్నట్టుగా ఉంటుంది. జీడిగింజల ఉత్పత్తికి ప్రధాన కారణమైన జీడిమామిడి పండ్లను మాత్రం పెద్దగా పట్టించుకోరు. అవి తోటల్లో చెట్ల కింద రాలిపోతూ, కుళ్లిపోతూ ఉంటాయి. ఇలా దేశంలో సాలీనా 40 లక్షల టన్నుల జీడిమామిడి పండ్లు తోటల్లో వృథా అవుతున్నాయని అంచనా.

ఎన్నో పోషకాలు

మంచి రంగు, రుచి, ఘాటైన వాసన కలిగిన జీడిమామిడి పండును తినగానే గొంతులో ఒకరకమైన జీర కలిగివుండటం వల్ల చాలామంది తినడానికి ఆసక్తి చూపించరు. అంతేకాక ఒకటి, రెండు రోజులకు మించి నిల్వ చేసుకునేందుకు అవకాశం లేని పండు కావడం, త్వరగా కుళ్లిపోయే స్వభాగం కలిగి ఉండడంతో జీడిమామిడి పండ్లు ఎక్కువగా తోటల్లో రాలిపోతూ, భూమిలో కలిసిపోతుంటాయి. వాస్తవానికి వీటిలో అనేక రకాల పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకనే వీటి వినియోగంపై దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) గ్రామీణ రైతు మహిళలకు శిక్షణ ఇస్తూ, కుటీర పరిశ్రమగా అభివృద్ధి అడుగులు వేసేందుకు కృషి చేస్తున్నాయి.

పలు రకాల ఆహార ఉత్పత్తులు

జీడిమామిడి పండ్లతో పలు రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. వీటిరసంతో శీతల పానీయాలు, గుజ్జుతో జామ్‌, మిక్స్‌డ్‌ ఫ్రూట్‌జామ్‌, చట్నీ, ఊరగాయ, కాండీ, టూటీ ఫ్రూటీ, టాఫీ, వినిగర్‌, చాకెట్లు (టాపీలు), చాకెట్‌ బార్లు, మున్నగు వాటని తయారు చేయవచ్చు. గోవాలో అత్యంత ఫేమస్‌గా లభించే ఫెన్నీ అనే మత్తు పానీయం జీడిమామిడి పండ్ల రసం నుండే తయారవుతుంది.

రసం తీసే విధానం

బాగా ముగ్గిన జీడిమామిడి పండ్లను సేకరించి, నీటితో శుభ్రం చేసిన తరువాత చేతులతో గానీ, ప్రత్యేక మెషీన్‌తో గానీ రసాన్ని తీస్తారు. ఇందుకు జ్యూస్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనివల్ల పండు నుంచి 70 శాతం రసాన్ని తీయడమే కాకుండా గంటకు 150 కిలోల పండ్ల నుంచి రసాన్ని తీసేందుకు అవకాశం ఉంటుంది. ఈ రసంలో ఉన్న టెనిన్స్‌ని (గొంతులో జీరను కలిగించే వగరు) తొలగించడానికి సగ్గు బియ్యంతో తయారుచేసిన గంజిని ఉపయోగిస్తుంటారు.

పలు పదార్థాల తయారీ

ఒక లీటర్‌ జీడిమామిడి పండ్ల రసం కోసం రెండు గ్రాముల సగ్గు బియ్యం పొడిని తీసుకుని, చల్లటి నీటిలో కరిగించి, ఆ తరువాత స్టీలు లేదా మట్టి పాత్రలో మరగబెట్టి చల్లార్చాలి. దానిలో ఒక లీటరు రసాన్ని కలిపి కదపకుండా రెండు గంటలపాటు ఉంచాలి. ఆ తరువాత ఆ పాత్రలో పైకి తేరిన రసం వాడుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో ఇనుప, రాగి పాత్రలను మాత్రం ఉపయోగించవద్దు. ఈ విధంగా తయారైన రసంతో శీతల పానీయం, సిరప్‌, జ్యూస్‌లను తయారు చేసుకోవచ్చు. రసం తీయగా మిగిలిన గుజ్జుతో జామ్‌, మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ జామ్‌, చట్నీలు తయారు చేయవచ్చు. జీడిమామిడి పండ్లతో మామిడి కాయల మాదిరిగా ఆవకాయ పెట్టవచ్చు. తీరిక సమయంలో తినేందుకు పొటాటో చిప్స్‌ మాదిరిగా తయారు చేసుకోవచ్చు.

పిప్పితో ఉపయోగాలు

జీడిమామిడి పండు నుంచి రసం తీసిన తరువాత వచ్చే పిప్పిని ఎండబెట్టి పశువులకు, కోళ్లకు దాణాగా వాడవచ్చు. వర్మీ కంపోస్టుగానూ ఉపయోగపడుతుంది. ఈ కంపోస్టులో 1.60 శాతం నత్రజని, 0.44 శాతం భాస్వరం, 0.58 శాతం పొటాషియం ఉంటాయి. గోవాలో ఈ పిప్పిని లిక్కర్‌ తయారీకి ఇంధనంగా వాడతారు. దీని నుంచి పెక్టిన్‌ అనే ముఖ్యమైన ఉత్పత్తిని తయారుచేయవచ్చు. ఇది జామ్‌, చాస్‌, జెల్లీ, కెచప్‌ తయారీలో చిక్కదనం రావడానికి తోడ్పడుతుంది. పలు రకాల మందులు, పౌడర్లు, పేస్టుల తయారీలోనూ ఉపయోగిస్తారు.

ఔషధ విలువలు

జీడిమామిడి పండులో ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పండులో లభ్యమయ్యే సి –విటమిన్‌ నిమ్మ జాతుల కంటే సుమారు 5 రెట్లు అధికంగా ఉంటుంది. పసుపు, ఎరుపు, గులాబీ రంగులలో దొరికే ఈ పండ్లలో 85 శాతం రసం, 10 శాతం చక్కెర ఉంటాయి. రసంలో ఫ్రక్టోజు, గ్లూకోజు, సుక్రోజు, మాల్టోజు, మాలిక్‌ ఆమ్లం ఉంటాయి.

● జీడిమామిడి పండు మంచి ఔషధకారిగా పనిచేస్తుంది. ఉదర సంబంధ వ్యాధులైన జిగట, నీళ్ల విరోచనాల నివారణకు, స్కర్వీ వ్యాధిని అరికట్టడానికి బాగా ఉపయోగపడుతుంది.

● మూత్ర పిండాల సమస్యలు, కలరా, డ్రాప్సీ వ్యాధి నివారణకు కూడా ఉపకరిస్తుంది. జీడిమామిడి పండు ఆరగించడం ద్వారా అరికాళ్ల పగుళ్లను నివారించవచ్చు.

● జీడిమామిడి రసంతో తయారుచేసిన ఫెన్నీ అనే మత్తు పానీయం పెద్దలకు, పిల్లలకు సంబంధించిన అనేక వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. వీటి విత్తనాలతో తయారు చేసిన పొడిని పాము కాటుకు విరుగుడుగా కూడా ఉపయోగిస్తుంటారు.

నిరుద్యోగులకు ఉపాధి

ఫుడ్‌ ప్రాసెసెంగ్‌ యూనిట్ల ద్వారా జీడిమామిడి పండ్లను కూడా ఉపయోగంలోకి తీసుకువచ్చే ప్రొసెస్‌ని చేపడితే, రాష్ట్రంలో ముఖ్యంగా జీడిమామిడి తోటలు ఉన్న మెట్ట ప్రాంతాలలో నిరుద్యోగ యువతకు ఉపాధి చూపవచ్చు. ఈ పండ్ల నుంచి తీసిన రసాన్ని యాప్సీ, ఫ్రూటీ, మాజాల మాదిరిగా టెట్రా ప్యాకింగ్‌ చేసి విక్రయించే ప్రక్రియ ద్వారా యువతకు ఉపాధి లభిస్తుంది. కేరళలో ఇప్పటికే జీడిమామిడి పండ్లతో తయారుచేసిన రసాన్ని శీతల పానీయంగా విక్రయిస్తున్నారు. గోవాలో ఫెన్నీ అనే మత్తు పానీయాన్ని తయారు చేస్తున్నారు. అంతేకాదు వీటితో చాకెట్లు, పలు రకాల విలువ ఆధారిత ఆహార పదార్థాలను కూడా తయారుచేసి ఉపాధికి మార్గం చూపవచ్చు.

సాధారణంగా జీడిగింజకే ప్రాధాన్యం

అయితే పండుతోనూ చాలా ఉపయోగాలు

ఉమ్మడి జిల్లాలో 30 వేల హెక్టార్లలో సాగు

మహిళలకు శిక్షణ

జీడిమామిడి పండులో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఆ విషయం తెలియక చాలామంది వీటిని ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపరు. అందుకనే ఎంతో విలువైన పండ్లు కుళ్లిపోయి, నేలపాలవుతున్నాయి. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జీడిమామిడి పండ్లతో ఎన్నిరకాల పదార్థాలను తయారు చేయ వచ్చో గ్రామీణ ప్రాంతాల మహిళలకు శిక్షణ ఇస్తున్నాం.

– డాక్టర్‌ వీఎస్‌జీఆర్‌ నాయుడు, ప్రధానాధికారి, కృషి విజ్ఞాన కేంద్రం,

కలవచర్ల, తూర్పు గోదావరి జిల్లా

30 వేల హెక్టార్లలో తోటలు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 30 వేల హెక్టార్లలో జీడిమామిడి తోటలు విస్తరించాయి. ఇక్కడ జీడి గింజలు తీసుకుని, పండ్లను తోటల్లోనే వదిలేస్తుంటారు. దీనితో కేరళ, గోవా రాష్ట్రాలలో మాదిరిగా జీడిమామిడి పండ్లను కూడా వినియోగంలోకి తీసుకువచ్చేందుకు డీసీసీడీ కొచ్చిన్‌ (కేరళ) సహకారంతో కేవీకేలో బ్యాచ్‌లు నిర్వహిస్తున్నాం. గత ఆరేళ్ల నుంచి ఉమ్మడి జిల్లాలో సుమారు 850 మంది రైతు మహిళలకు శిక్షణ ఇచ్చాం.

– జేవీఆర్‌ సత్యవాణి, గృహవిజ్ఞాన విభాగం అధికారి, కేవీకే, కలవచర్ల,

తూర్పు గోదావరి జిల్లా

తోటల్లో జీడిమామిడి పండ్ల గ్రేడింగ్‌ 1
1/5

తోటల్లో జీడిమామిడి పండ్ల గ్రేడింగ్‌

జీడిమామిడి పండ్లు2
2/5

జీడిమామిడి పండ్లు

జీడిమామిడి పండ్లతో తయారు చేసిన రసం, పచ్చడి
3
3/5

జీడిమామిడి పండ్లతో తయారు చేసిన రసం, పచ్చడి

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement