కలెక్టరేట్లో నేడు స్పందన
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం సోమవారం యథావిధిగా కలెక్టరేట్లో జరుగుతుందని కలెక్టర్ కె.మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారుల కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు.
17 నుంచి గో సమ్మేళనం
ద్వారకా తిరుమల: ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకూ ద్వారకా తిరుమల మార్కెట్ యార్డులో గో సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఒంగోలు, పుంగనూరు జాతుల అభివృద్ధి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పలపాటి చక్రపాణి కోరారు. మార్కెట్ యార్డులో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఒంగోలు, పుంగనూరు జాతి ఆవులు, గిత్తల అందాల పోటీలు, ఒంగోలు ఆవుల పాల పోటీలు నిర్వహించ తలపెట్టామన్నారు. ఒంగోలు, పుంగనూరు ఆవులు, గిత్తలను వివిధ కేటగిరీలుగా విభజించి పోటీలు నిర్వహిస్తామని, విజేతలకు బహుమతులు అందిస్తామని చెప్పారు. పోటీలు జరిగే మూడు రోజులూ గో ఆధారిత వ్యవసాయంపై నిపుణులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులను గుర్తించి ఘనంగా సత్కరిస్తామని చక్రపాణి తెలిపారు.