అమలాపురం రూరల్: అల్లవరం మండలం కొమ్మరగిరిపట్నం పంచాయతీకి ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించడంపై వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు రాష్ట్ర మాజీమంత్రి, పినిపే విశ్వరూప్ హర్షం వ్యక్తం చేశారు. కొమ్మరగిరిపట్నం సర్పంచ్ విజయలక్ష్మి ఆదివారం భట్నవిల్లిలో విశ్వరూప్ను కలసి సర్టిఫికెట్ వచ్చిన క్రమాన్ని వివరించారు. ఈ సందర్భంగా విశ్వరూప్ ఆమెను సత్కరించారు. ఆమెతో జెడ్పీటీసీ కొనుకు గౌతమి, సర్పంచ్ బర్రె సీతారత్నం, ఎంపీటీసీ సుబ్బిరామ్, ఇళ్ల ఏడుకొండలు, సాపే సత్యనారాయణ పాల్గొన్నారు.
ఉత్కంఠగా అండర్–9
చెస్ పోటీలు
అమలాపురం టౌన్: స్థానిక విద్యానిధి స్కూలులో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్–9 జిల్లా స్థాయి చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగాయి. 30 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ క్రీడల్లో బాలుర విభాగంలో ద్రాక్షారామకు చెందిన పాయసం నిఖిల్ దుర్గా వికాస్ ప్రధమ, అమలాపురానికి చెందిన పేరూరి రుత్విక్ ద్వితీయ స్థానాలను కై వసం చేసుకున్నారు. బాలికల విభాగంలో ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లికి చెందిన బొడ్డు సాన్వి ప్రధమ, రావులపాలేనికి చెందిన బొచ్చు హిమబిందు ద్వితీయ స్థానాలను గెలుచుకున్నారు. వీరు వచ్చే నెల 18, 19 తేదీల్లో అన్నవరం జరగనున్న అండర్–9 రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్ షిప్ పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి తాడి వెంకట సురేష్ తెలిపారు.
కిక్కిరిసిన అయినవిల్లి
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామి వారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. పంచామృతాభిషేకాలు, లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకాలు జరిపారు. స్వామివారి సన్నిధిలో జరిగే లక్ష్మీ గణపతి హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


