తుపాను బాధితులకు జీవన భృతి ఇవ్వాలి
సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్
అమలాపురం టౌన్: జిల్లాలోని తుపాను బాధితులకు జీవన భృతి, నష్ట పరిహారం తక్షణమే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. తుపాను బాధిత ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున జీవన భృతి ఇవ్వాలని సూచించింది. స్థానిక గొల్లగూడెంలో గల జిల్లా సీపీఎం కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తుపాను బాధితులకు జీవన భృతిని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పార్టీ నాయకుడు జి.దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం పంటల నష్టాన్ని అంచనా వేయాలని సూచించింది. ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె.కృష్ణవేణి, టి.నాగవరలక్ష్మి, నూకల బలరామ్, డీవీరావు, డి.లక్ష్మి పాల్గొన్నారు.
పునరావాస కేంద్రాల్లోకి
తరలించాలి
తాళ్లరేవు: తుపాను బాధితులను సమీపంలోని పునరావాస కేంద్రాల్లోకి చేర్చే బాధ్యత స్థానిక నాయకులు తీసుకోవాలని కలెక్టర్ సగిలి షణ్మోహన్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కోరారు. మంగళవారం గాడిమొగ కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని వారు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్బాబుతో కలిసి సందర్శించారు. కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అనంతరం వారు తుపాను బాధితులకు భోజనాలను వడ్డించారు. వారు మాట్లాడుతూ మత్స్యకార గ్రామాల్లో పలువురు పునరావాస కేంద్రాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారన్నారు. తుపాను తీవ్రత పెరిగినందున గ్రామాల్లో ఉండడం సురక్షితం కాదని, వారందరినీ పునరావాస కేంద్రానికి వచ్చేలా స్థానిక నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు. తుపాను పట్ల భయపడాల్సిన పనిలేదని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని తెలిపారు.
ప్రాణ, ఆస్తినష్టం
లేకుండా చూడండి
మంత్రి అచ్చెన్నాయుడు
సాక్షి, అమలాపురం: మోంథా తుపాను వల్ల ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన వివిధ శాఖల అధికారులతో తుపానుపై సమీక్ష జరిపారు. తుపాను తీవ్రత, సహాయక చర్యలు, పునరావాస కేంద్రాల నిర్వహణ, రోడ్లు, రాకపోకలు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రత్యేకాధికారి విజయరామరాజు, కలెక్టర్ ఆర్.మహేష్కుమార్తో కలిసి సమీక్షించారు. సముద్ర తీరానికి ఒక కిలోమీటర్ పరిధిలో నివాసముంటున్న వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఎంపీ జి.హరీష్ మాధుర్, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, ఎస్పీ రాహుల్ మీనా, జేసీ నిశాంతి, డీఆర్వో కె.మాధవి పాల్గొన్నారు.
ఏలేరుకు వరద నీరు
ఏలేశ్వరం: మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఏలేరు రిజర్వాయర్లోనికి వరద నీరు పోటెత్తుతోంది. పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో 5,175 క్యూసెక్కుల మేర నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, మంగళవారం 85.39 మీటర్లకు చేరింది.
తుపాను బాధితులకు జీవన భృతి ఇవ్వాలి
తుపాను బాధితులకు జీవన భృతి ఇవ్వాలి


