
ట్యాబ్.. స్విచ్చాఫ్
● బోధనకు కూటమి మంగళం
● గత ప్రభుత్వంలో విద్యార్థులకు పంపిణీ
● పట్టించుకోని ప్రస్తుత పాలకులు
పునరుద్ధరించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల అభ్యున్నతికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ట్యాబ్ విద్యాబోధనను కొనసాగించాలి. గతంలో ఇచ్చిన ట్యాబ్లు ప్రస్తుతం అప్డేట్ సమస్యతో పనిచేయడం లేదు. గత ప్రభుత్వం ఆ ట్యాబ్లను ఇచ్చిందన్న కారణంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. ఈ విధానం సరైంది కాదు. ట్యాబ్ విద్యాబోధనను వెంటనే పునరుద్ధరించాలి.
– నేరేడుమిల్లి నరేష్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం కొత్తపేట మండల అధ్యక్షుడు, గంటి
నెరవేరని లక్ష్యం
గత ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లు ఎంతో ఉపయోగంగా ఉండేవి. దేశంలో మరెక్కడా విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం వాటిని సాంకేతికతతో రూపొందించారు. 2023–24లో ట్యాబ్లు పొందిన విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. అయితే వారి వద్ద ఉన్న ట్యాబ్లు పనిచేయక గత ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోయింది.
– కేపీసీహెచ్ సూర్యారావు, యూటీఎఫ్ కొత్తపేట మండల అధ్యక్షుడు
కొత్తపేట: ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదవాలి, ప్రపంచంతో పోటీ పడాలి అనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. దానిలో భాగంగానే ప్రభుత్వ విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. విద్యావ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది. ముఖ్యంగా సాంకేతిక విద్యపై విద్యార్థులు మక్కువ పెంచుకునేలా పథకాలు అమలు చేసింది. కోట్ల రూపాయలు వెచ్చించి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఉచితంగా అందజేసింది. వాటి ద్వారా విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు ప్రోత్సాహం అందించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్యాబ్లతో విద్యాబోధనకు మంగళం పాడింది.
జగన్ ముద్ర కనిపించకుండా..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను గమనిస్తే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి, వాటి ముద్ర కనిపించకుండా చేసే లక్ష్యంతోనే పరిపాలన సాగిస్తున్నట్టు తేటతెల్లమవుతోంది. గత ప్రభుత్వం అమలు చేసిన ప్రజా ప్రయోజన పథకాలను కొనసాగించి, హుందాగా వ్యవహరించడానికి బదులు రాజకీయాలకు పాల్పడుతోందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కేవలం కక్ష సాధింపు ధోరణితో ముందుకు వెళుతోందన్నారు.
పేద విద్యార్థులపై చిన్నచూపు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2022–23 సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ ప్రారంభించింది. రెండేళ్ల పాటు అందజేసింది. ఉపాధ్యాయులు ఆ ట్యాబ్ల ద్వారా అత్యాధునిక సాంకేతికతతో పాఠ్యాంశాలు బోధించేవారు. వాటితో విద్యార్థులు చక్కగా చదువుకునేవారు. ట్యాబ్ల వినియోగం కోసం పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కనీస పర్యవేక్షణ, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడం, బైజూస్ ఒప్పందం ముగియడం, మళ్లీ రెన్యువల్ చేసుకోకపోవడం ద్వారా ట్యాబ్ విద్యాబోధనను నిర్వీర్యం చేసింది. ఫలితంగా అవి మూలనపడ్డాయి.
ఒక్కో ట్యాబ్కు రూ.32 వేల ఖర్చు
గత ప్రభుత్వంలో 8వ తరగతి విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్లు అందజేశారు. వాటిలో బైజూస్ కంటెంట్తో కూడిన వీడియోలు పొందుపరిచారు. ఇవి పదో తరగతి వరకూ ఉపయోగపడేలా రూపొందించారు. దీని కోసం ఒక్కో ట్యాబ్పై సుమారు రూ.32 వేలు ఖర్చు చేశారు. 2023–24లో ట్యాబ్లు తీసుకున్న విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. తమ వద్ద ఉన్న ట్యాబ్లు సాఫ్ట్వేర్ సమస్యలతో మొరాయిస్తున్నాయని వారు తెలిపారు. ఈ సమస్యను ఉపాధ్యాయులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన లేదన్నారు.
కోనసీమ జిల్లా సమాచారం
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1,266
ప్రాథమికోన్నత పాఠశాలలు 45
ఉన్నత పాఠశాలలు 252
మొత్తం పాఠశాలలు 1,563
1 నుంచి 10వ తరగతి వరకు
విద్యార్థులు 89,672
రెండేళ్లలో విద్యార్థులకు
ఇచ్చిన ట్యాబ్లు 30,379
ట్యాబ్లకు ఖర్చు చేసిన
మొత్తం రూ.97.21 కోట్లు

ట్యాబ్.. స్విచ్చాఫ్

ట్యాబ్.. స్విచ్చాఫ్