
వేడుకల వేళ విషాదం
● కొత్త దుస్తులు కొనుగోలు చేసేందుకు
వెళుతుండగా ప్రమాదం
● తండ్రి మృతి, కుమారుడికి గాయాలు
తాళ్లరేవు: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దుస్తులు కొనుగోలు చేసేందుకు నాలుగేళ్ల కుమారుడితో కలిసి వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు మండలం శీల్లంక గ్రామానికి చెందిన జల్లి బాలకృష్ణ (33) అలియాస్ బాలాజీ కోరంగి పోలీస్ స్టేషన్ సమీపంలో నూడుల్స్ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జెండా పండగ కోసం తన కుమారుడు చాణక్యకు కొత్త దుస్తులు కొనేందుకు గురువారం ఆ బాలుడిని తీసుకుని యానాం బయలుదేరాడు. వారిని యానాం బైపాస్లో మంగళ ఎంటర్ప్రైజెస్ వద్ద మినీ వ్యాన్ వేగంగా ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందగా, చాణక్యకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన బాలుడిని యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ప్రమాదాన్ని పసిగట్టిన బాలాజీ తన కుమారుడిని గుండెలకు హత్తుకుని పట్టుకోవడంతో ఆ బాలుడు ప్రమాదం నుంచి బయటపడినట్లు స్థానికులు చెబుతున్నారు. బాలాజీ మృతదేహం వద్ద అతడి సోదరుడు ప్రకాష్ బోరున రోదించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె ప్రస్తుతం గర్భిణి. కాగా.. పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేడుకల వేళ విషాదం