
స్థానచలనం.. లేని వేతనం
●
● బదిలీలు, పదోన్నతులు సరే,
ఉపాధ్యాయులకు అందని జీతాలు
● పొజిషన్ ఐడీలు రాక అగచాట్లు
● ఉమ్మడి జిల్లాలో 1,500 మందికి ఇబ్బంది
రాయవరం: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ముగిశాయి.. ఇందులో పలువురికి పొజిషన్ ఐడీలు రాకపోవడంతో జీతభత్యాలు నిలిచిపోయాయి. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 1,500 మందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. సాధారణంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో రెగ్యులర్ జీతాలు తీసుకుంటున్నప్పటికీ వీరి స్థానం మారడంతో ఏ స్థానానికి బదిలీ అయ్యారో ఆ స్థానానికి సంబంధిత ఉద్యోగికి పొజిషన్ ఐడీ కేటాయించాలి. అది జరిగితేనే సీఎఫ్ఎంఎస్లో వారి వివరాలు డిస్ప్లే అవుతాయి. అప్పుడు మాత్రమే వేతనాలు చెల్లించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6,533 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు 178 మందికి, మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా 284 మందికి, స్కూల్ అసిస్టెంట్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 3,298 మందికి, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 2,995 మందికి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు 32 మందికి, ఆర్ట్/డ్రాయింగ్/క్రాఫ్ట్/మ్యూజిక్ /ఒకేషనల్ ఉపాధ్యాయులు 20 మందికి స్థాన చలనం కలిగింది. జూన్ 15వ తేదీ నాటికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయ్యింది. కొత్తగా ఏర్పడిన మోడల్ ప్రైమరీ స్కూల్స్కు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు బదిలీ అయ్యారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలు కొత్తగా ఏర్పడడంతో ఇక్కడకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. అయితే బదిలీలు జరిగి నెల కావొస్తున్నా నేటికీ అధిక శాతం ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. ఫలితంగా జూలైలో తీసుకోవాల్సిన జూన్ నెల జీతాలు వీరికి మంజూరు కాలేదు. వేతనాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా జీతాల బిల్లులు ప్రతి నెలా 25వ తేదీ లోపు సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి, ట్రెజరీకి బిల్లు సమర్పించాలి. ఈ నెల 25వ తేదీ లోపు పొజిషన్ ఐడీలు రాకుంటే జూలై జీతం కూడా వీరు పొందలేని పరిస్థితి నెలకొంటుంది. పలు ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నా నేటికీ పూర్తి స్థాయిలో పొజిషన్ ఐడీలు క్రియేట్ కాలేదు.
సమస్యలు ఎక్కడెక్కడంటే..
గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117కు వ్యతిరేకంగా ప్రస్తుత ప్రభుత్వం జీవో 21ను తీసుకువచ్చింది. ఆరు రకాల పాఠశాలల స్థానంలో ఇప్పుడు తొమ్మిది రకాల పాఠశాలలు ఏర్పడ్డాయి. ఇందులో ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్, అప్గ్రేడ్ అయిన యూపీ స్కూల్స్లో కొత్తగా ఉపాధ్యాయుల నియామకం జరిగింది. ఈ పాఠశాలలకు కొత్తగా పోస్టులు మంజూరు కావడంతో ఆ స్థానాలకు బదిలీ పొందిన వారికి పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. మోడల్ ప్రైమరీ స్కూల్స్లో అప్పటి వరకూ అదే స్కూల్ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అప్పటికే పొజిషన్ ఐడీలు ఉండడంతో వారికి వేతనాలు చెల్లించారు. ఇదే పాఠశాలకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పాజిషన్ ఐడీలు రాకపోవడంతో వేతనాలు పొందలేని పరిస్థితి నెలకొంది. అలాగే ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ అయిన పాఠశాలల్లో డీడీఓ మారడంతో అక్కడ ఏ ఒక్కరికీ జీతభత్యాలు రాని పరిస్థితి ఉంది. సాధారణంగా జూన్ నెలలో ప్రతి కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లల స్కూల్ ఫీజులు, విద్యా సామగ్రి కోసం రూ.వేలల్లో వెచ్చించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణాలు తీసుకున్న వారు నెలవారీ ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి. అలాగే బదిలీ అయిన ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు, ఇంటి అద్దెలు, అడ్వాన్సుల రూపంలో మరింత ఖర్చు పెరిగిందని, ఈ నేపథ్యంలో జీతాలు రాకపోవడం ఇబ్బంది కలుగుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యను పరిష్కరించాలి
పొజిషన్ ఐడీలు వెంటనే కేటాయించక పోవడంతో బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో కొందరు జీతాలు పొందలేకపోయారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించేందుకు, కుటుంబ ఖర్చులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి.
– మేడిచర్ల త్రివెంకట ఆది సత్య సుబ్బారావు,
జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్, కోనసీమ
ఈనెల జీతాలైనా వస్తాయా!
రాష్ట్ర వ్యాప్తంగా 72 వేల మంది ఉపాధ్యాయులు పొజిషన్ ఐడీలు రాక జూన్ నెల లేక జీతాలు పొందలేకపోయారు. జూలై నెల జీతాల బిల్లు సబ్మిట్ చేసే సమయం ఆసన్నమవడంతో ఈ నెల జీతాలు వస్తాయా? రావా? అన్న మీమాంసలో ఉన్నారు. పొజిషన్ ఐడీలు వెంటనే కేటాయించి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలి.
– ఎస్ఎస్ పల్లంరాజు,
జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ, కోనసీమ
ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
పొజిషన్ ఐడీలు రాక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. జూన్, జూలై నెలలకు సంబంధించి వేతనాలు చెల్లించేందుకు ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలి. ఇప్పటికే ఒక నెల వేతనం రాక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయుల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలి.
– చింతాడ ప్రదీప్కుమార్, జిల్లా అధ్యక్షుడు,
పీఆర్టీయూ, కాకినాడ జిల్లా

స్థానచలనం.. లేని వేతనం

స్థానచలనం.. లేని వేతనం

స్థానచలనం.. లేని వేతనం