
తోడుదొంగలకు పాలించే హక్కు లేదు
● కూటమి మోసాలను జనంలో ఎండగడదాం
● చంద్రబాబు పాలనలో మహిళలు,
రైతులకు కడగండ్లు
● హామీల అమలుపై ప్రశ్నిస్తే
అణచివేత ధోరణి
● శాసనమండలి సాక్షిగా
లోకేష్ అబద్ధపు వ్యాఖ్యలు
● వైఎస్ జగన్ బాటలో జనంలోకి వెళ్దాం
● వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్,
శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స
● మండపేటలో ‘బాబు ష్యూరిటీ,
మోసం గ్యారెంటీ’ కార్యక్రమం
కపిలేశ్వరపురం (మండపేట): ఎన్నికల సమయంలో అసంబద్ధమైన హామీలను ఇచ్చి గెలిచాక ప్రజలను మోసం చేస్తున్న కూటమి నేతల తీరును జనంలో ఎండగడదామంటూ వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండపేటలో శుక్రవారం ఎమ్మెల్సీ, నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమ్తూరులు ఆధ్వర్యంలో ‘బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరి సంతకాలతో సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారో ప్రొజెక్టర్ ద్వారా బొత్స వివరించడం సభికులను ఆలోచనలో పడేసింది. బొత్స మాట్లాడుతూ చంద్రబాబు, పవన్కల్యాణ్ ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పారని, అధికారంలోకి వచ్చాక తోడు దొంగల్లా ప్రజలను మోసగిస్తున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు, రైతుల మోసగిస్తారన్నారు. తన రాజకీయాల్లోకి వారినే పావులుగా వాడుకోవడం చంద్రబాబు నైజం అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మేనిఫెస్టోని దైవంగా భావించి అమలు చేసి చూపించారన్నారు. తన హయాంలో ఇస్తానన్న లబ్ధి అందలేదన్న వారు ఎవరూ లేరన్న విషయాన్ని గమనించాలన్నారు. వైఎస్ జగన్ ఓడిపోలేదని, ఎక్కడికెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారని, మిర్చి, పొగాకు రైతుల కోసం ఉద్యమించారన్నారు. ఇప్పట్లో ఎన్నికలు లేవని ఏడాదిలోనే కూటమి పాలన వైఫల్యం చెందిందన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలన్న జగన్ ఆదేశాలపై బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ నినాదంతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలని నమ్మే వైఎస్సార్ సీపీ కార్యకర్తలు.. బాధ్యతగా జనంలో పనిచేయాలన్నారు. జనం తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామన్నారు. రాజద్రోహం కేసులు పెడతామని ప్రభుత్వాధినేతలు చెబుతున్నారని, వాస్తవానికి మోసం చేసినందుకు ప్రభుత్వాధినేతల పైనే కేసు పెట్టాలన్నారు. అణచివేయదలిస్తే కార్యకర్త వెనుక మొత్తం పార్టీ ముందు ఉండి పోరాడుతుందన్నారు. ప్రభుత్వ లబ్ధి పొందని వారంతా అసంతృప్తితో బయటకొస్తున్నారన్నారు. ఉద్యోగం వచ్చిన ఇల్లంటూ ఏదీ లేదన్నారు. శాసన మండలిలో అన్నదాతా సుఖీభవ సాయం సొమ్మను ఏప్రిల్, మేలో ఇస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారని, నేటికీ రైతుకు లబ్ధి చేకూరలేదన్నారు. లోకేష్ చెప్పిన మాటలను తన సెల్ఫోన్ ద్వారా సభికులకు వినిపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోటార్లకు మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టండన్న లోకేష్ ఇప్పుడు మోటార్లు బిగించే పని చేయిస్తున్నారన్నారు. పోలవరం నీటి సరఫరా విషయంలో తెలంగాణ, ఆంధ్రా సీఎంలు ఇద్దరూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.
దుర్మార్గమైన పాలన సాగుతోంది
పార్టీ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను చెట్టుకి కట్టి హింసిస్తున్న దుర్మార్గమైన పాలన సాగుతోందన్నారు. గతంలో 600 పైచిలుకు, 2024లో 143 హామీలు ఇచ్చి అమలులో ప్రజలను మోగించిన కూటమిని జనంలో ఎండగట్టాలన్నారు. చంద్రబాబు తన తనయుడు లోకేష్ను విశ్వ మేధావిగా ప్రచారం చేస్తున్నారనీ, దేశం మొత్తంలోని యూనివర్శిటీల్లో సీట్లన్నీ నిండిపోగా ఆంధ్రప్రదేశ్లోని సీట్లు ఖాళీగా ఉండడం లోకేష్ మేధాశక్తికి అద్దం పడుతోంద్ననారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బొత్స సత్యనారాయణ 25 బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ సమావేశాలను పూర్తి చేసుకొని 26వ సమావేశానికి కోనసీమ జిల్లాకు వచ్చారన్నారు. ఏడాది పాలన అనంతరం చంద్రబాబుకు రాష్ట్రంలో ఎక్కడా ఆదరణ లేదన్నారు. వైఎస్ జగన్ వెంట జనం తండోప తండాలుగా వస్తున్నారు. మండపేటలో ఎమ్మెల్సీ తోట వెంట జనం నిలబడటమనేది 2029 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయానికి నిదర్శనమన్నారు. మహానగరమని చెప్పుకొనే హైదరాబాద్లో కంటే ఆంధ్ర రాష్ట్రంలోని పల్లెల్లో కరెంటు బిల్లు అధికంగా వస్తుందన్నారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ తోట ప్రారంభ ఉపన్యాసం చేస్తూ మున్సిపల్ కార్యాలయం సమీపంలో మద్యం షాపును తొలగించమంటూ మున్సిపాలిటీలో తీర్మానం చేసినా కనీస స్పందన లేకపోవడం కూటమి పాలన తీరుకు అద్దం పడుతోందన్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే నినాదం రాష్ట్రం మొత్తంలో వైరల్ అయ్యిందని, వాస్తవాలు ఆ దిశగా ఉండటంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడి వెళ్లినా జనం తమ సమస్యలను చెప్పుకుంటున్నారని అన్నారు. పార్టీ నియోజకవర్గం పరిశీలకుడు కంఠంశెట్టి ఆదిత్య, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేలు, మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకదుర్గారాణి, పలు నియోజకవర్గాల నాయకులు గొల్లపల్లి సూర్యారావు, శ్రీనివాస్, పితాని బాలకృష్ణ, పాముల రాజేశ్వరి, మాకినీడు శేషుకుమారి, కొవ్వూరి త్రినాథరెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాసు పాల్గొన్నారు.
చంద్రబాబువి నీచ రాజకీయాలు
ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా విఫలం అయిందన్నారు. మేనిఫెస్టోను దైవంగా భావించి అమలు చేసి చూపిన గొప్పనేతగా దేశం మొత్తంలో వైఎస్ జగన్ గుర్తింపు పొందారన్నారు. వైఎస్ జగన్ కంటే మరింత ఎక్కువ లబ్ధి చేకూర్చుతారని నమ్మిన ప్రజలను కూటమి మోసగించిందన్నారు. మేనిఫెస్టోను అమలు చేసి తీరుతానని, అలా చేయని పక్షంలో పార్టీనే రద్దు చేసుకుంటానని చెప్పిన ఏకై క నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా క్షేత్ర స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల నాయకులపై కక్ష సాధింపులు ఉండకూడదని, చంద్రబాబు నీచ రాజకీయాలు నడుపుతున్నారన్నారు.

తోడుదొంగలకు పాలించే హక్కు లేదు