
ఊరూరా.. మనసారా..
● ఘనంగా వైఎస్సార్ జయంత్యుత్సవం
● పండగను తలపించిన వేడుకలు
● మహానేత విగ్రహాలు, చిత్రపటాలకు పుష్పాంజలి
● అమలాపురంలో పాల్గొన్న ఎంపీ బోస్,
జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ
● కొత్తపేటలో నివాళులర్పించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
● హాజరైన మాజీ ఎమ్మెల్యేలు,
కో ఆర్డినేటర్లు, కార్యకర్తలు
సాక్షి, అమలాపురం: సంక్షేమ ప్రదాత, అభివృద్ధి దార్శినికుడు, పేదల హృదయాలను గెలిచిన నాయకుడు, రైతు పక్షపాతి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని మంగళవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పండగలా ఈ కార్యక్రమం జరిగింది. దివంగత మహానేతకు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. ఆ మహనీయుని పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు వస్త్ర దానం, రోగులకు పాలు, పండ్ల వితరణ జరిపారు.
● కొత్తపేట నియోజకవర్గం పరిధిలో పలుచోట్ల వైఎస్సార్ జయంతిని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. శ్రీకృష్ణదేవరాయ కాపు కల్యాణ మంటపంలో 14 మంది రైతులను సత్కరించారు. వారి సమక్షంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకుపంచారు. అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
● జిల్లా కేంద్రమైన అమలాపురం నియోజకవర్గంలో పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి జరిగింది. అమలాపురం హైస్కూల్ సెంటర్లో జరిగిన వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, శాసనమండలి సభ్యులు కూడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, శ్రీకాంత్ పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో శ్రీకాంత్తో పాటు పలువురు నాయకులు రక్తదానం చేశారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచి పెట్టారు. ఆసుపత్రి వద్ద పేదలకు వస్త్రదానం చేశారు. స్థానిక హరి మనో వికాస కేంద్రంలో మానసిక దివ్యాంగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు.
● పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని పి.గన్నవరం మూడు రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి పాల్గొన్నారు. స్థానిక సీహెచ్సీలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. విలస లెప్రసీ ఆస్పత్రి వద్ద రోగులకు పండ్లు, దుప్పట్లను పంపిణీ చేశారు.
● రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి, మున్సిపల్ కార్యాలయం వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సమక్షంలో పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సూర్యప్రకాష్తో పాటు నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.
● రాజోలు నియోజకవర్గంలో పార్టీ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంత్యుత్సవం ఘనంగా జరిగింది. తాటిపాక, మామిడికుదురు, మలికిపురం, శివకోడు, నగరం, సఖినేటిపల్లిలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
● మండపేట నియోజకవర్గం పరిధిలోని మండపేట పట్టణం, మండపేట రూరల్, కపిలేశ్వరపురం, రాయవరం మండలాల్లో వైఎస్సార్ జయంతిని వేడుకలా జరిపారు. ఎమ్మెల్సీ, నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు పాల్గొని దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యాలయంలో అన్నదానం, సీహెచ్సీలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు.
● ముమ్మిడివరం నియోకవర్గం పరిధిలోని ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, తాళ్లరేవు మండలాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక పోలమ్మ చెరువు వద్ద గల వైఎస్సార్ విగ్రహానికి పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఊరూరా.. మనసారా..

ఊరూరా.. మనసారా..

ఊరూరా.. మనసారా..