
వెంకన్న దేవస్థానం ముఖద్వారానికి శంకుస్థాపన
రావులపాలెం: రావులపాలెంలో ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం ముఖద్వారం నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. వాడపల్లి క్షేత్రానికి నిత్యం, ముఖ్యంగా శనివారం రాష్ట్ర నలుమూలల నుంచీ అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాల వైపు వాడపల్లి క్షేత్రానికి వెళ్లే భక్తులకు స్వాగత ద్వారంగా వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం ముఖద్వారం (ఆర్చ్ గేట్)ను దాతల ఆర్థిక సాయంతో నిర్మించాలని దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ప్రతిపాదించారు. అందుకు సీఎంఆర్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ మేరకు రావులపాలెం కళా వెంకట్రావు విగ్రహం సమీపంలో నిర్మించాలని నిర్ణయించారు. సుమారు రూ.20 లక్షలతో ఈ ఆర్చ్ గేట్ నిర్మాణానికి ఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో సీఎంఆర్ చైర్మన్ మావూరి వెంకటరమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు.