బేగంపేటలో వ్యక్తి దారుణ హత్య.. | Man Was Brutally Murdered In Begumpet, Know Reasons Inside | Sakshi
Sakshi News home page

బేగంపేటలో వ్యక్తి దారుణ హత్య..

Jun 9 2024 8:01 AM | Updated on Jun 9 2024 2:39 PM

 బండరాయితో మోది.. ఆపై ముళ్లపొదల్లో పడేసి.. 

 ముగ్గురు నిందితులు అరెస్టు.. 

 వివాహేతర సంబంధమే హత్యకు కారణం..!  

సనత్‌నగర్‌: బేగంపేట అల్లంతోటబావిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తలపై బండరాయితో మోది ముళ్లపొదల్లో పడవేసి నిందితులు పరారయ్యారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. బేగంపేట పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆ ప్రాంతానికి చెందిన అన్నామలై అయ్యప్ప(40)కు గత పదేళ్ల క్రితం గాయత్రి అనే యువతితో వివాహమయ్యింది. అయ్యప్ప సికింద్రాబాద్‌ పార్క్‌లైన్‌లోని ఓ ప్రింటర్‌ షాపులో పనిచేస్తున్నాడు. ఉదయం 9.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లి రాత్రి 10 గంటలకు తిరిగి వస్తుంటాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే శుక్రవారం కూడా విధులకు వెళ్లాడు. కాగా భార్య గాయత్రికి రాత్రి 8 గంటల సమయంలో స్థానికులు ఓ వార్తను చేరవేశారు. 

అల్లంతోటబావి ఆర్‌కే టవర్స్‌ వెనుక ముళ్ల పొదల్లో అయ్యప్ప రక్తపుమడుగులో పడున్నట్లు స్థానికులు ఇచి్చన సమాచారంతో హుటాహుటిన ఆమె అక్కడికి చేరుకున్నారు. భర్త పరిస్థితిని చూసిన ఆమె వెంటనే స్థానికుల సహాయంతో 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో క్షతగాత్రుడు అయ్యప్పను గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. పరిస్థితి విషమించి అయ్యప్ప అర్ధరాత్రి 1.22 గంటలకు మృతి చెందాడు. అయ్యప్ప భార్య గాయత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటుచేశారు. 

24 గంటలు గడవకముందే అరెస్టు.. 
భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సెల్‌ఫోన్‌ ఆధారంగా ఎవరెవరితో అయ్యప్ప మాట్లాడాడు, ఎవరిపై అనుమానాలు ఉన్నాయనే అంశాలను పరిశీలించారు. దీంతో నేరుగా నిందితుల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్లు కొమ్మల సంతోష్‌ అలియాస్‌ సంతు (34), సయ్యద్‌ రజా (37), ప్రైవేటు ఉద్యోగి గొర్ల హర్షవర్ధన్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా, హత్య విషయాన్ని ఒప్పుకున్నారు. 

వివాహేతర సంబంధమే హత్యకు కారణం..! 
హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల విచారణలో తేలింది. నిందితుల్లో ఒకరైన కొమ్మల సంతోష్‌ భార్య సాయికన్యకు హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ అయ్యప్ప ఆమెతో చనువుగా ఉండేవాడు. ఆ చనువు కాస్తా శారీరక సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న సంతోష్‌ పలుమార్లు భార్యను హెచ్చరించడంతో పాటు అయ్యప్పకూ వార్నింగ్‌ ఇచ్చాడు. అయ్యప్పను అంతమొందించాలని పథకం వేసిన సంతోష్‌ తన స్నేహితులు సయ్యద్‌ రజా, హర్షవర్ధన్‌ల సహాయం కోరాడు. వీరంతా శుక్రవారం సాయంత్రం మద్యం సేవించి అయ్యప్పను కలుసుకుని మద్యం సేవించాలని పట్టుబట్టారు. అయితే తాను మద్యం సేవించనని చెప్పడంతో అయ్యప్పతో వాగ్వాదానికి దిగారు. ఆవేశంతో సంతోష్‌ గ్రానైట్‌ రాయితో అయ్యప్పతలపై  పలుమార్లు మోది హత్య చేశాడు.  

 

Advertisement
 
Advertisement
Advertisement