తల్లిని కాపాడేందుకు చెరువులో ఐదేళ్ల చిన్నారి సాహసం

Leg Slip Mother Demise Into Pond And 5 Years Old Girl Tried To Save - Sakshi

చెరువు కబళించింది

బట్టలు ఉతుకుతూ కాలు జారి నీళ్లలో మునిగి మహిళ మృతి

తల్లిని కాపాడే యత్నంలో నీట మునిగిన చిన్నారి

వెంటనే స్పందించి కాపాడిన రైతులు

పలమనేరు: బట్టలు ఉతుకుతూ కాలుజారి చెరువులో పడి తల్లి మునకలేసింది.  తల్లిని చూసి కాపాడేందుకు ధైర్యం చేసి చెరువులోకి దిగిన చిన్నారి తానూ మునిగిపోతూ కేకలేసింది. ఇది విన్న స్థానికులు పరుగున అక్కడికి చేరుకుని చిన్నారిని రక్షించారు. తల్లి మాత్రం తిరిగిరాని లోకాలకు చేరుకుంది. శుక్రవారం ఈ సంఘటన మండలంలో పకీరుపల్లె వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మొగిలప్ప కుమార్తె సుజాత (40) తన తండ్రి వద్దే ఉంటోంది.

ఆమె తన కుమార్తె లక్ష్మి (5)తో కలసి గ్రామ సమీపంలోని కూర్మాయిచెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లింది. దుస్తులు ఉతుకుతుండగా కాలుజారి చెరువులో పడి మునిగిపోయింది. ఇది చూసి లక్ష్మి గట్టిగా కేకలు వేసినా ఎవరూ రాకపోయేసరికి తల్లిని కాపాడేందుకు తానే చెరువులోకి దిగడంతో బాలిక సైతం మునిగింది. ఆ బాలిక కేకలు విన్న సమీపంలోని రైతులు అక్కడికి చేరుకుని కాపాడారు.

బాలికను ఆస్పత్రికి తరలించారు. సుజాత కోసం గాలించినా ఫలితం లభించలేదు. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక కేంద్రం అధికారి బాబు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గంటపాటు గాలించి సుజాత మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top