పెళ్లి​ మండపంలో షాకింగ్‌ ఘటన.. వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు..

Groom Arrested Minutes Before Wedding In Mailardevpally - Sakshi

మైలార్‌దేవ్‌పల్లి: మరి కొద్దిసేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు...కటకటాల పాలయ్యాడు. తనను ప్రేమించి..పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ మరో యువతి పెళ్లి మండపం వద్దకు పోలీసుల్ని పంపింది. ప్రియుడ్ని అరెస్టు చేయించింది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ పి.మధు, బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మిగూడ ప్రాంతానికి చెందిన తుమ్మల పృథ్వీరాజ్‌ ముదిరాజ్‌కు మంచిరేవుల ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది.

ఈ మేరకు శుక్రవారం అజీజ్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌ హాలులో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొద్దిసేపట్లో వివాహం జరగనుండగా..ఓ యువతి పృథ్వీరాజ్‌ తనను ఆరేళ్లుగా ప్రేమించి..పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసి ఫంక్షన్‌ హాలు వద్దకు పోలీసుల్ని పంపింది.

ఈ మేరకు పోలీసులు పృథ్వీరాజ్‌ను అరెస్టు చేసి...వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కాగా పృథ్వీరాజ్‌ ఆస్తులపై కన్నేసిన యువతి కుటుంబ సభ్యులు తప్పుడు కేసు పెట్టి పెళ్లి ఆపించారని అతని తరపు బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు పృథ్వీరాజ్‌ సిద్ధపడినా కులం పేరు చెప్పి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని వారు పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top