
మేమింతే..మారం అంతే!
● వివాదాలకు కేంద్రంగా చిత్తూరు వన్టౌన్ ● గతంలో దొంగ నుంచి డబ్బులు తీసున్నారనే ఆరోపణలు ● తాజాగా హోమ్గార్డు సొంత పనులకు? ● అధికారిని వదిలేసి.. హెడ్ కానిస్టేబుల్ వీఆర్
చిత్తూరు అర్బన్: చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్.. ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ అధికారితో పాటు కొందరు సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అధికారికి స్థానచలనం కల్పించి.. ఇంకొందరిని మాత్రం అలాగే వదలేశారు. మళ్లీ ఇప్పుడు ఓ హోంగార్డును సొంత పనులకు వాడుకున్నారనే ఆరోపణలు రావడంతో హెడ్ కానిస్టేబుల్ను వీఆర్ (వేకంట్ రిజర్వు)కు తీసుకున్నారు. కానీ హోంగార్డును వాడుకున్న అధికారిని మాత్రం ఉపేక్షించి వదిలేశారు.
మారరా..?
చిత్తూరు నగరంలోని కట్టమంచిలో గత ఏడాది ఓ దొంగతనం జరిగింది. దాదాపు రూ.9 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసులో నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు.. అతడి నుంచి రూ.లక్షల్లో లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించి, నివేదిక తెప్పించుకున్నారు. కానీ విచారణలో ఏం తేలిందనే విషయం మాత్రం రహస్యంగానే ఉంచేశారు. ఇద్దరు అధికారులు, ముగ్గురు సిబ్బందిపై ఆరోపణలు రాగా.. కేవలం ఓ అధికారిని మాత్రం వీఆర్కు పంపించారు. ఈ ఉదాసీనత తప్పుచేసిన మిగిలినవాళ్లకు ధైర్యాన్ని ఇచ్చినట్లయ్యింది. ఇటీవల వరుస ఆరోపణలకు మళ్లీ వన్టౌన్ పోలీస్ స్టేషన్ కేంద్రబిందువుగా మారింది.
ఇదేం న్యాయం
మూడు రోజుల క్రితం ఇక్కడ పనిచేస్తున్న హెడ్కానిస్టే బుల్ను వీఆర్కు పంపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇటీవల స్టేషన్లో పనిచేస్తున్న ఓ హోంగార్డును సొంత పనులకు పంపించారనే ఆరోపణలపై హెడ్కా నిస్టేబుల్ను వీఆర్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్టేషన్ లో తనపైఅధికారి అడిగితే హోంగార్డును పంపడం, ఆ యన హోంగార్డును కడప వరకు డ్రైవర్గా వాడుకున్న ట్లు సమాచారం. ఈ విషయం ఉన్నతాధికా రులకు తెలి యడంతో హెడ్కానిస్టేబుల్పై బదిలీ వేటు పడింది. కా నీ హోంగార్డును వాడుకున్న అధికారిపై ఎలాంటి చర్య లు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
వాస్తు మార్పులు
స్టేషన్లో పనిచేసే ఒకరిద్దరు అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం, సిబ్బందిని వాడుకున్నారనే ఆరోపణలు రావడంతో ఇక్కడ పనిచేసే మిగిలిన వాళ్లు నలిగిపోతున్నారు. ఇతర సిబ్బందిపై తప్పుడు మాటలు చెప్పడం, స్టేషన్లో జరిగే విషయాలను నేతలకు ఉప్పందించడం లాంటి విమర్శలు ఎదుర్కొనేవాళ్లు బాగానే ఉన్నారని.. ఏమీ తెలియని తమపై ఒత్తిడి పెరుగుతోందని పలువురు వాపోతున్నారు. అసలు కొద్ది రోజులుగా స్టేషన్ పరిస్థితి బాగోలేదని గుర్తించారు. ఈశాన్యంలో బరువు ఉండడమే దీనికి కారణమని భావించి, పలు తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలను ఈశాన్యం నుంచి తీయించి, మరోవైపునకు మార్చారు. మారాల్సింది తప్పుచేసే వాళ్ల బుద్ధి తప్ప.. బరువు కాదని ఇప్పటికై నా గుర్తిస్తే ఫలితం ఉంటుంది.