
గందరగోళంగా బదిలీలు
చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి జిల్లాలోని గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా సాగింది. ఆదివారం స్థానిక రెవెన్యూ భవన్లో ఈ ప్రక్రియను ఉదయం నుంచి రాత్రి వరకు చేపట్టారు. చాలీచాలని స్థలంలో బదిలీలు నిర్వహించడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో పలువురు రోడ్డు పై నిలబడి కౌన్సెలింగ్ పిలుపు కోసం నిరీక్షించారు. బదిలీ కౌన్సెలింగ్ను ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకుల లేఖలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు నెలకొన్నాయి. తిరుపతి పరిసర మండలాల్లోని పంచాయతీ ఖాళీలను బదిలీ కౌన్సెలింగ్లో డిస్ప్లే చూపకుండా బ్లాక్ చేశారని బాధితులు వాపోయారు. సీనియార్టీలో మొదటి 50 మందికి కూడా తిరుపతి పరసర ప్రాంతాలు చూపించకుండా 50, 60 కి.మీ, దూరంలోని పంచాయతీలను ఎంపిక చేసుకోవాలని అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇంజినీరింగ్ సహాయకుల బదిలీ కౌన్సెలింగ్ భారీ సంఖ్యలో జరిగాయి. చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఇంచార్జి ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి ఈఈ రామ్మోహన్, మదనపల్లె ఈఈ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను నిర్వహించారు. స్పౌజ్ కోటాలో సమీప పంచాయతీల ఎంపికకు అవకాశం కల్పించలేదని ఆరోపణలు గుప్పుమన్నాయి.
కేంద్రాల్లో ఆందోళన
నిబంధనలకు విరుద్దంగా ప్రక్రియ నిర్వహించారని ఉద్యోగులు కౌన్సెలింగ్ను అడ్డుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని స్థానాలను బ్లాక్ చేయించినట్లు తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీలు చూపకుండా మొక్కుబడిగా కౌన్సెలింగ్ నిర్వహించడాన్ని నిరసిస్తూ కౌన్సెలింగ్ కేంద్రంలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కౌన్సెలింగ్ ప్రక్రియ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించడంతో అభ్యర్థులు ఆందోళనను విరమించారు. టీడీపీ ఎమ్మెల్యేల మితిమీరన జోక్యంతో కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళానికి దారి తీసింది.
సిఫార్సులకు పెద్దపీటపై సచివాలయ ఉద్యోగుల నిలదీత
కౌన్సెలింగ్ కేంద్రంలో అసౌకర్యాలతో అవస్థలు
సౌకర్యాల్లేక ఇబ్బందులు
రెవెన్యూ భవన్లో అధికారులు కనీస సౌకర్యాలు కూడ కల్పించలేకపోయారు. ఉమ్మడి జిల్లాలో 664 మంది సచివాలయాల్లో ఇంజినీరింగ్ సహాయకులు ఉన్నారు. 650 చోట్ల ఖాళీలు ఉండగా దాదాపు 450 ఖాళీలు చూపించారని బాధితులు ఆరోపించారు. బదిలీ కౌన్సెలింగ్ సోమవారం కూడా జరగనుంది.

గందరగోళంగా బదిలీలు