
దహనక్రియలకు వెళ్లి వస్తుండగా..
● వేగంగా వచ్చి ద్విచక్ర వాహనదారుడిని ఢీకొన్న టాటాఏస్ ● శరీరం నుంచి తెగిపడిన తల
శ్రీరంగరాజపురం : గ్రానైట్లోడుతో వేగంగా వచ్చిన వాహనం ద్విచక్రవాహనదారున్ని ఢీకొట్టడంతో శరీరం నుంచి తల వేరుపడి మృతి చెందిన సంఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లి దళితవాడకు చెందిన రమేష్ (44) శ్రీరంగరాజపురం మండలంలోని క్షీరసముద్రం గ్రామంలో తమ సమీప బంధువు మరణించడంతో దహనక్రియలకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి బైక్లో బయలుదేరాడు. అయితే 49 కొత్తపల్లిమిట్ట నుంచి గ్రానైట్ లోడ్తో వచ్చిన టాటాఏస్ వాహనం చిత్తూరు పుత్తూరు జాతీయరహదారి మర్రిపల్లి వద్ద రమేష్ బైక్ను వేగంగా ఢీకొట్టింది. దీంతో రమేష్ శరీరం నుంచి తల తెగి సమీప పొలంలో పడింది. అక్కడికక్కడే రమేష్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. అయితే టాటాఏస్ వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని పశువుల కాపరులు తెలిపారు. తాము చూస్తుండగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు. టాటాఏస్ వేగంగా వచ్చి రమేష్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిందన్నారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
– మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
మండలంలోని మర్రిపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన రమేష్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. శనివారం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రమేష్ మరణించడం బాధాకరమన్నారు. రమేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

దహనక్రియలకు వెళ్లి వస్తుండగా..