
నేడు పోలీసు గ్రీవెన్స్ రద్దు
చిత్తూరు అర్బన్ : చిత్తూరులో సోమవారం నిర్వహించాల్సిన పోలీసు గ్రీవెన్స్ను రద్దు చేస్తున్నట్లు ఎస్పీ మణికంఠ ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా గ్రీవెన్స్ రద్దు చేశామని, ప్రజలు ఎవ్వరూ కూడా వినతులు ఇవ్వడానికి చిత్తూరుకు రావొద్దని ఆయన సూచించారు.
పింఛన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లావ్యాప్తంగా జూలై 1వ తేదీన సామాజిక పింఛన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూలై 1వ తేదీన ఉదయం 7 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నామన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అందిస్తామన్నారు. ఈ నెల 30వ తేదీన బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పంపిణీ కానీ పింఛన్ నగదును రెండురోజుల్లో బ్యాంకుల్లో తిరిగి చెల్లించాలని డీఆర్డీఏ పీడీ తెలిపారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
గుడిపాల: మండలంలో ఆదివారం కారు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలోని మద్రాస్ క్రాస్ రోడ్డు సమీపంలో లారీ చైన్నె రోడ్డు నుంచి వేలూరు వైపు తిరుగుతోంది. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు లారీ కిందకు దూసుకెళ్లింది. లారీకి వున్న బంపర్లు తగులుకుని కారు ఆగిపోయింది. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
బైక్ దొంగ అరెస్టు
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో పలుచోట్ల ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన రాజేష్ (20) అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం వన్టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సీఐలు మహేశ్వర, నెట్టికంటయ్య వివరాలను మీడియాకు వెల్లడించారు. నగరంలోని రెడ్డిగుంట సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా రాజేష్ అనే వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకుని విచారిస్తే.. నగరంలోని పలు ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించాడన్నారు. తమిళనాడులోని వేలూరు నగరానికి చెందిన రాజేష్ నుంచి రూ.3 లక్షల విలువ చేసే అయిదు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి రిమాండు విధించడంతో జిల్లా జైలుకు తరలించారు.

నేడు పోలీసు గ్రీవెన్స్ రద్దు