
విద్యను వ్యాపారంగా మార్చేశారు!
– కేశవరెడ్డి పాఠశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ధర్నా
చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని కేశవరెడ్డి పాఠశాలలో జరుగుతున్న ఫీజుల దోపిడీని విద్యాశాఖ అధికారులు అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం చిత్తూరులోని మురుగానపల్లిలో ఉన్న కేశవరెడ్డి పాఠశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ఆ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న పుస్తకాలు, ఇతర విద్యాసామగ్రిని పాఠశాల ఎదుట పెట్టి ధర్నా నిర్వహించారు. బండి చలపతి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి యూనిఫాం, పుస్తకాలను అమ్ముకుంటున్న కేశవరెడ్డి పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులతో పాటు విద్యాసామగ్రిని దోచుకుంటున్నారన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మార్చేసిన విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నా, నాయకులు యోగేష్, నిరంజన్ పాల్గొన్నారు.