
పోటీలు నిర్వహించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని డీఈఓ వరలక్ష్మి ఆదేశించారు. ఈ మేరకు ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తల్లి పాత్ర సహకారం అనే అంశంపై పోటీలు నిర్వహించాలన్నారు. ఈ నెల 28 వరకు వ్యాసరచన, వ్యక్తృత్వ, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని సూచించారు.
భోజనం సకాలంలో అందుతుందా?
గుడిపాల: సమస్యలు ఏమైనా పరిష్కారమయ్యాయా..? భోజనం సకాలంలో అందుతుందా..? అంటూ కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఆయన గుడిపాల మండలంలోని ఫుడ్ అండ్ ఇన్స్, తాసా మామిడి గుజ్జు పరిశ్రమలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల వద్దకు వెళ్లి వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భోజనం సకాలంలో అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ముందుగా వచ్చిన రైతులకు ముందుగా టోకెన్లు జారీ చేయాలన్న నిబంధన పాటించాలని మామి డి గుజ్జు పరిశ్రమ వారిని ఆదేశించారు. ప్రభు త్వం ప్రకటించిన రూ.4 మద్దతు ధరను డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, డెప్యూటీ తహసీల్దార్ లక్ష్మి ఉన్నారు.
టమాట ధరలకు రెక్కలు
పలమనేరు: టమాట ధరలకు రెక్కలొచ్చాయి. పలమనేరు మార్కెట్లో 15కిలోల బాక్సు మంగళవారం రూ.350 దాకా పలికింది. పొరుగునే ఉన్న కర్ణాటకలోని వడ్డిపల్లి మార్కెట్లో రూ.400 దాకా పెరిగింది. వర్షాల కారణంగా సరుకు నాణ్యత తగ్గింది. దీనికితోడు సీజన్ ముగిసిపోతుండడంతో దిగుబడి తగ్గుతోంది. ఫలితంగా టమాట రేట్లు పెరుగుతున్నాయి.
జూలై నుంచి ఆశాజనకంగా ధరలు
ఇలా ఉండగా జూలై తొలి వారంలో కోతకొ చ్చే తోటలకు ధరలు ఆశాజనంగా ఉంటాయని ఇక్కడి వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి దాకా ఉన్న తోటలు ఈనెల ఆఖరుకల్లా వడిగిపోతాయి. ఆపై కొత్త తోటలు కోతకు రావడంతో డిమాండ్ పెరిగి ధరలు ఆశాజనకంగా ఉంటాయని చెబుతున్నారు. దీంతోపాటు పలు రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంటుందనే మాట వినిపిస్తోంది.

పోటీలు నిర్వహించండి