
ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఆంధ్ర యూనివర్సిటీ ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన ఏపీపీజీఈసెట్–2025 ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులో 13 పీజీ సబ్జెక్టుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఏపీపీజీసెట్కు ఎస్వీయూ రీజియన్ నుంచి 3,946 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా ప్రవేశ పరీక్షకు 3,434మంది హాజరయ్యారు. వీరిలో 3,208 మంది ఉత్తీర్ణత సాధించారు. జీఈఓ ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫోమ్యాటిక్స్ విభాగంలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన టి. సుధాకర్రెడ్డి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించగా, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో తిరుపతికి చెందిన విజయ్వర్మ 5వ ర్యాంకు సాధించాడు.
నేడు కరికులంపై ప్రాంతీయ వర్క్షాప్
తిరుపతి ఎడ్యుకేషన్: రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా బోర్డు (ఎస్బీటీఈటీ) ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ డిప్లొమో కరికులంపై తిరుపతిలోని గోల్డెన్ తులీప్ హోటల్లో బుధవారం ప్రాంతీయ వర్క్షాపు నిర్వహించనున్నట్టు స్థానిక ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాఽథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వర్క్షాప్కు సాంకేతిక విద్య డైరెక్టర్ జి.గణేష్కుమార్, ఎస్బీటీఈటీ కార్యదర్శి జీవీవీఎస్.మూర్తి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎంఏవీ.రామకృష్ణ, డెప్యూటీ కార్యదర్శి డాక్టర్ కె.లక్ష్మీపతి హాజరవుతారని, ఈ వర్క్షాప్లో పలువురు పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పాలిటెక్నిక్ ప్రిన్సిపాళ్లు, టీచర్లు పాల్గొని పాలిటెక్నిక్ డిప్లొమో విద్యార్థులకు అవసరమైన సిలబస్ తయారీపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.