
అగ్రికల్చర్ డిప్లొమా ప్రవేశాలకు 30 వరకు గడువు
తిరుపతి సిటీ: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 2025–26 విద్యాసంవత్సరానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు గడుపు ఈనెల 30 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.సుమతి ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఈ నెల 16తో ప్రవేశాల గడువు ముగిసిందని, విద్యార్ధుల సౌకర్యార్థం నెలాఖరు వరకు గడువు పెంచినట్లు చెప్పారు. అగ్రికల్చర్, ఆర్గానిక్, సీడ్ టెక్నాలిజీ, అగ్రి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్ధులు విశ్వవిద్యాలయం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదని, పదోతరగతిలో పొందిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారని తెలియజేశారు.
ఎస్వీయూను సందర్శించిన యూకే డిప్యూటీ హైకమిషనర్
తిరుపతి సిటీ: యునైటెడ్ కింగ్డమ్ డిప్యూటీ హైకమిషనర్ విన్ ఓవెన్ మంగళవారం ఎస్వీ యూనివర్సిటీని సందర్శించారు. ఆయన ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడుతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ, భారతీయ పారిశ్రామిక రంగాలతో యూకే బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసేందుకు అంకితభావంతో ఉందన్నారు. ఉమ్మడి పరిశోధన, విద్యామార్పిడి, వాణిజ్య వెంచర్ల కోసం స్పష్టమైన మార్గాలను అన్వేషించడం తన సందర్శన లక్ష్యమని చెప్పారు. ఏపీలో అమలవుతున్న విద్యా విధానం, అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంలో సహాయ సహకారాలకు ఉన్న అవకాశాలపై చర్చించారు. కార్యక్రమంలో వంశీకృష్ణ, లక్ష్మి, శ్రీనివాస్, శశికుమార్ పాల్గొన్నారు