
ఊరిలోని బడి కోసం పోరాటం
పలమనేరు : తమ గ్రామంలోనే బడి ఉండాలని, పక్క ఊరికి మారిస్తే పిల్లలను పంపే ప్రసక్తే లేదని, ఇందుకోసం పోరాటం కొనసాగిస్తామని మండలంలోని కొలమాసనపల్లె పంచాయతీ పాలమాకులపల్లె వాసులు స్పష్టం చేశారు. మంగళవారం ఈమేరకు పలమనేరు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ మా గ్రామంలోని బడిలో 30మంది పిల్లలున్నారన్నారు. ఎర్రగొండేపల్లె, కురప్పల్లె, జల్లిక్వారీ, హాచరీ ప్రాంతాలనుంచి ఇక్కడికే విద్యార్థులు వస్తున్నారని తెలిపారు. అయితే ఈ బడిలోని 3,4,5 తరగతుల పిల్లలను దిగువ కల్లాడు పాఠశాలకు పంపాలంటే ఇబ్బందులు తలెత్తుతాయని వెల్లడించారు. ఆ మార్గంలో నిత్యం టిప్పర్లు వేగంగా వెళుతుంటాయని, దీంతో పిల్లలకు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఎక్స్ప్రెస్ హైవే పనుల వద్ద బ్లాస్టింగ్లు జరుగుతుంటాయని వాపోయారు. అలాగే రోడ్డు పక్కనే చెరువులా వరదనీరుందని అందులో పిల్లలు పడిపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తమ సమస్యలను పరిగణనలోకి తీసుకుని మా గ్రామంలోని బడిని మార్చవద్దని కోరారు. దీనిపై ఇప్పటికే ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.