
ఆదేశాలు బేఖాతరు
విద్యా హక్కు చట్టం ప్రకారం 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా ప్రభుత్వమే ఆనన్లైన్ ద్వారా సీట్లు కేటాయిస్తుంది. దీనిని ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయనట్టే. దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. స్కూల్ అనుమతి రద్దు చేయడం జరుగుతుంది. అయితే పేదల సీట్ల విషయంలో అధికారులు ప్రైవేటు/ కార్పొరేటు స్కూళ్లను బతిమలాడుకోవాల్సి వస్తోంది.
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడంలో విద్యాశాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లల్లో ఈ చట్టం కచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. అయితే రెండు జిల్లాల్లో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. స్కూళ్లు ప్రారంభించిన వెంటనే ఆర్టీఈ (విద్యాహక్కు చట్టం) కింద ఒకటో తరగతి అడ్మిషన్లకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన అనంతరం ఆన్లైన్ లాటరీ విధానంలో విద్యార్థులకు పలు పాఠశాలల్లో ప్రవేశాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ప్రవేశాల పత్రాలను తల్లిదండ్రులు తీసుకెళ్లి పాఠశాలల్లో ఇస్తుంటే అడ్మిషన్లు ఇచ్చేది లేదంటూ తిరిగి పంపించేస్తున్నారు. ఇదేమిటి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయరెందుకు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే....తమకు ఆర్టీఈ అడ్మిషన్ల జాబితానే ఇవ్వలేదంటూ పాఠశాలల నిర్వాహకులు సమాధానమిస్తున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 3978 సీట్లు కేటాయిస్తే అందులో 10 శాతం సీట్లను సైతం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రవేశాలు చేసుకోని దుస్థితి నెలకొంది.
వివరాలు గోప్యం?
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు తప్పనిసరిగా విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం అడ్మిషన్లు ఇవ్వాలి. ఆర్టీఈ ద్వారా కొన్నేళ్లుగా ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ చేపడుతున్నా.. వాటి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతోంది. ఏటా అడ్మిషన్ల సమయంలో హడావుడి చేసే విద్యాశాఖ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా ఏయే పాఠశాలలో ఎన్ని ప్రవేశాలు కల్పించారనే వివరాలను మాత్రం వెల్లడించడం లేదు. ఇప్పటి వరకు ఆర్టీఈ ద్వారా కల్పించిన వివరాలు విద్యాశాఖ బయట పెట్టలేదు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఒత్తిడితోనే వివరాలు బయటపెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
విద్యాశాఖ అధికారులకే స్పష్టత కరువు
ఉచితమైనా లాగేస్తున్నారు..
జిల్లాలో మొక్కుబడిగా ఆర్టీఈ అడ్మిషన్లు
పర్యవేక్షించే నాథుడే కరువు
చిత్తూరు, తిరుపతి జిల్లాలో
3,978 సీట్లు కేటాయింపు
ఆమోదించిన సీట్లు 10శాతం లోపే
చట్టం ఆదేశాలు పట్టించుకోని యాజమాన్యాలు
వైఎస్సార్సీపీ పాలనలో పక్కాగా ఆర్టీఈ అమలు
ఆర్టీఈ అడ్మిషన్ల ప్రక్రియపై జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ అధికారులకే స్పష్టత లేని దుస్థితి. ఈ చట్టం ద్వారా ఎంత మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారనే విషయంపై అధికారులు స్పష్టత లేదు. నిత్యం వందల మంది తల్లిదండ్రులు ఆర్టీఈ అడ్మిషన్ల విషయంపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన ఉండటం లేదు. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని విద్యార్థులు ఆర్టీఈ ప్రవేశాలు పొందినప్పటికీ తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది ఒకటో తరగతిలో జాయిన్ చేసుకున్న చిత్తూరు నగరంలోని ఓ ప్రముఖ కిడ్స్ పాఠశాల.. ఈ ఏడాది మాత్రం ఏకంగా తమ స్కూల్లో ఒకటి, రెండు తరగతులు నిలిపివేశామని సెలవిచ్చింది. దీంతో ఆన్లైనన్లో కేటాయింపు జరిగిన 18 మంది పిల్లల అడ్మిషన్లు అయోమయంలో పడ్డాయి. రెండు జిల్లాల్లో ఇలాంటి సమస్యలు మరెన్నో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్టీఈ ప్రవేశాలు పకడ్బందీగా అమలు చేయాలి
ఆర్టీఈ అడ్మిషన్లు ఖరారు అయినప్పటికీ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తమకు ఏ మాత్రం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమస్యను విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం స్పందించడం లేదు. ఫలితంగా నిత్యం తల్లిదండ్రులు విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు తప్ప న్యాయం మాత్రం జరగడం లేదు. చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు ఆర్టీఈ ప్రవేశాలను పకడ్బందీగా అమలు చేయాలి.
– ప్రవీణ్కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా
చట్టం ప్రకారం ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పిస్తే పదో తరగతి వరకూ ఆ వెసులుబాటు ఉంటుంది. ఇవాళ ప్రైవేటు/ కార్పొరేటు పాఠశాలల్లో చూస్తే ఒకటో తరగతికి రూ.లక్ష లాగేస్తున్నారు. వాస్తవంగా లెక్కలు వేస్తే పాక్షిక ఉచితమనే విషయం బోధపడుతుంది. బస్సు, పుస్తకాలు, యూనిఫాం, షూ, టై, బెల్టు, బిల్డింగ్ ఫండ్, స్పెషల్ ఫీజు, ఐఐటీ, నీట్ ఇలా రకరకాల బాదుడు మామూలే. ఈ డబ్బులు ఆయా తల్లిదండ్రులు చెల్లించాల్సిందే. కేవలం ట్యూషనన్ ఫీజులో మాత్రమే ఉచితం కాదుగానీ రాయితీ ఇస్తున్నారు. అయినప్పటికీ ఆర్టీఈ ప్రకారం అడ్మిషన్లు అనగానే యాజమాన్యాలు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకొనే అవకాశం విద్యాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఆదేశాలు బేఖాతరు