
న్యాయం అందేది ఎప్పుడో మరి..?
● ప్రజాసమస్యల పరిష్కార వేదికలో బాధితుల ని‘వేదన’ ● అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ విద్యాధరి
ప్రదక్షిణలతో సరి..
చిత్తూరు కలెక్టరేట్ : న్యాయం చేస్తారనే ఆశతో ప్రతి వారం కలెక్టరేట్ లో అర్జీ ఇస్తున్నాం..ఇంకెన్ని సార్లు తిరగాలి సారూ? అని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు సమస్యలపై అర్జీలు ఇచ్చారు. అర్జీలిస్తున్నా పరిష్కారం కావడం లేదని పలువురు వాపోయారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్వో మోహన్కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుపమ, విజయలక్ష్మి, ఆర్డీవో శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
256 అర్జీలు
వివిధ సమస్యలపై 256 అర్జీలు అధికారులకు అందాయి. రెవెన్యూ, సర్వే శాఖకు 198, పోలీసు శాఖ 13, డీఆర్డీఏ 11, ట్రాన్స్కో 7, ఆర్అండ్బీ 1, పౌర సరఫరాల శాఖ 7, పశుసంవర్థక శాఖ 2, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ 4, వాటర్ రిసోర్స్ 4, దేవదాయశాఖ 1, విద్యాశాఖ 2, కలెక్టరేట్ ఏఓ 2, డీసీసీ బ్యాంక్ 1, ఎంపీడీఓ పాలసముద్రం 1, హౌసింగ్ 2 అర్జీలు వచ్చినట్లు కలెక్టరేట్ ఏఓ కులశేఖర్ వెల్లడించారు.
మామిడి చెట్లను జేసీబీతో తొక్కించేశారు
తాము నాటి పెంచిన మామిడి చెట్లను అగ్ర కులస్తులు జేసీబీతో తొక్కించి నాశనం చేశారనిచౌడేపల్లె మండలం దిగువపల్లె మొట్లపల్లె యానాదులు వరలక్ష్మి, శారద, వెంకటలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. తమ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 193/5, 193/6 సర్వే నంబర్లో 7 ఎకరాల డీకేటీ భూమి ఉందని, ఆ భూమిని చదును చేసి ఐదేళ్ల నుంచి మామిడి మొక్కలు పెంచుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం అగ్ర కులస్తులు వాటిని జేసీబీతో పూర్తిగా నేలమట్టం చేశారని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
వినతులు స్వీకరిస్తున్న జాయింట్ కలెక్టర్ విద్యాధరి
గ్రామసభకు విలువ లేదా?
కాలువలు నిర్మించాలని గ్రామసభలో తీర్మానిస్తే టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని జీడీనెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె ఎంపీటీసీ భారతి, సర్పంచ్ పార్థసారథి రెడ్డి జేసీ కి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లా డుతూ, తమ గ్రామంలోని ఒక ప్రాంతంలో వర్షపునీరు, మురుగునీరు నిల్వ లేకుండా చేయడానికి కాలువ నిర్మించాలని తీర్మానిస్తే, గ్రామస్తుడు రుషేంద్రరెడ్డి తాను వేలంలో పొందిన గుడిమాన్యం భూమికి సీసీ రోడ్డు వేసుకునేందుకు కాలువ నిర్మించకూడదని అ డ్డుపడుతున్నారని, కొందరు కూటమి నాయకులు సైతం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటు న్నారని నివేదించారు. ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరారు. బుగ్గపట్నం సర్పంచ్ మునిరాజారెడ్డి, వైస్ ఎంపీపీ హరిబాబు, గ్రామస్తులు సుధాకర్రెడ్డి, రఘునాథరెడ్డి, బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
నెలలు గడుస్తున్నా ఇవ్వని సదరం సర్టిఫికెట్
నెలలు గడుస్తున్నా సదరం సర్టిఫికెట్ ఇవ్వడం లేదని యాదమరి మండలం షికారికాలనీకి చెందిన దివ్యాంగురాలు నందిని వాపోయారు. ఆమె మాట్లాడుతూ, సదరన్ సర్టిఫికెట్కు కొన్ని నెలల క్రితం బంగారుపాళ్యం ప్రభుత్వాస్పత్రికి వెళ్లానని చెప్పారు. తల్లిదండ్రులు లేని తనకు జీవనాధారం ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ కోసం అవసరమైన సదరన్ సర్టిఫికెట్కు దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఇవ్వలేదని వాపోయారు.
ప్రతి పనికీ రేటు ఫిక్స్..!
– కోసలనగరం సొసైటీ బ్యాంకు ఇన్చార్జి సీఈఓ రూటే వేరు
విజయపురం మండలం కోసలనగరం సొసైటీ బ్యాంకు ఇన్చార్జి సీఈఓ బ్యాంకును తన జేబు సంస్థగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని బాధితులు వేలు, కుమార్ తదితరులు జేసీకి వినతి పత్రం ఇచ్చారు. రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన సొసైటీలో ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి ఇన్చార్జి సీఈఓ రైతులకు అన్యాయం చేస్తోందని, సొసైటీ బ్యాంకు నిధులను తన సొంత ప్రయోజనాలకు వినియోగించుకుంటోందని ఆరోపించారు. సీఈఓగా అర్హత లేకున్నా దొడ్డిదారిలో ఇన్చార్జిగా కొనసాగుతున్నారన్నారు. బ్యాంకు రుణాలు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని, తన కుటుంబ సభ్యులకు, కావాల్సిన వారికి మాత్రం రుణాలు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. రైతులతో అమర్యాదకరంగా మాట్లాడుతున్నారని, రిటైర్డ్ సీఈఓ మురుగయ్య, ప్రస్తుత ఇన్చార్జి సీఈఓ రాధ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, సమగ్ర విచారణ చేసి చేయాలని కోరారు. దీనిపై జేసీ వెంటనే విచారణకు ఆదేశించారు.

న్యాయం అందేది ఎప్పుడో మరి..?

న్యాయం అందేది ఎప్పుడో మరి..?

న్యాయం అందేది ఎప్పుడో మరి..?