
పత్రం ఎప్పుడిస్తారు సారూ!
జిల్లాలో పీఎంఏవై 2.0 వివరాలు నియోజకవర్గం పీఎంఏవై గృహాల మంజూరు వివరాలు చిత్తూరు 828 కుప్పం 575 నగరి 516 పలమనేరు 438 పుంగనూరు 115 మొత్తం 2472
‘చిత్తూరు అర్బన్లో గిరింపేటకు చెందిన రమణమ్మ సొంతింటి కోసం అర్జీ ఇచ్చారు. పీఎంఏవై– 2.0 కింద మంజూరవుతుందని అధికారులు చెప్పడంతో పునాది వరకు సొంత డబ్బులతో నిర్మించారు. అయితే ఇప్పటి వరకు అధికారులు ఇంటి మంజూరు పత్రం ఇవ్వలేదు. ఆందోళనకు గురైన ఆమె నిర్మాణ పనులు ఆపేశారు’.
చిత్తూరు కలెక్టరేట్ : వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో జిల్లా వ్యాప్తంగా లక్షలాది మందికి సొంతిళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించారు. సొంతిళ్లను, ఇళ్ల పట్టాలనూ మంజూరు చేసింది. ఇళ్లు కాదు; ఊళ్లు నిర్మిస్తామని ఇచ్చిన మాటను సైతం ఆచరణలో సాకారం చేసింది. వందలాది లేఔట్లలో ఇళ్లు నిర్మించి ఊర్లకు ఊర్లనే సృష్టించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పీఎంఏవై 2.0 కింద గృహ నిర్మాణానికి కేంద్రం వాటాలో రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాలో రూ.లక్ష చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది. మరోవైపు చిత్తూరు జిల్లాలో ఈ పథకానికి వేలాది మంది అర్జీలు ఇచ్చారు. ఇళ్ల మంజూరుకు అధికారులు డీపీఆర్లు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. అర్హులంతా ఇళ్ల మంజూరు పత్రం కోసం జనవరి నుంచి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకూ రూపాయి కూడా ఇచ్చిన పాపానపోలేదు. హౌసింగ్ శాఖాధికారులు కూడా నోరు మెదపడం లేదు. ఫలితంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు నిరాశకు లోనవుతున్నారు.
ముందస్తుగా ఆర్భాట సర్వే
జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లోని పేదలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఐదు నెలల ముందే ఆర్భాటంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) 2.0 పథకం కింద సర్వే చేసింది. జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో సొంత స్థలం ఉండి, ఏడాదికి రూ.3 లక్షల ఆదాయంలోపు ఉన్న వారికి పీఎంఏవై 2.0 పథకం మంజూరు చేసే నిమిత్తం సర్వేకు పూనుకుంది. ముందస్తుగా వార్డు సచివాలయ ఉద్యోగులతో డిమాండ్ సర్వే మాత్రం అట్టహాసంగా చేయించినా ఆపై గృహాలు మంజూరు చేయకుండా చేతులెత్తేసింది. ఈ సర్వేలో ఇంటి స్థలం లేని వారు, ఇంటి నివాస స్థలంతోపాటు ఇల్లు మంజూరు చేయాలని మరికొందరు, పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలాలున్నాయని..తమకు హౌసింగ్ స్కీమ్లో గృహాలు మంజూరు చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు. ఇలా జిల్లాలో 42,347 దరఖాస్తులు అందాయి. వాటిలో కోతల అనంతరం, కూటమి ప్రజాప్రతినిధులు చెప్పిన వారికి 2,472 మందిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు.
మంజూరు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు
నెలల కాలంగా ప్రదక్షిణలు
పట్టించుకోని హౌసింగ్ శాఖ అధికారులు
అనుమతుల కోసం నిరీక్షణ
పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉండి, హౌసింగ్ స్కీమ్లో మంజూరు చేస్తే ఇల్లు నిర్మించుకుంటామనే ఆసక్తితో 2472 మంది పేదలు దరఖాస్తులు చేసుకున్నారు. అందిన దరఖాస్తులను పరిశీలించిన హౌసింగ్ శాఖ అధికారులు డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను ప్రభుత్వానికి నివేదించారు. పీఎంఏవై 2.0 పథకానికి జిల్లా వ్యాప్తంగా కార్పొరేషన్, మున్సిపల్ ప్రాంతాల్లో 2,024 డిసెంబర్లో దరఖాస్తులు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇళ్ల మంజూరుపై అతీగతి లేదు. మంజూరు పత్రాలిస్తే పనులు ప్రారంభిస్తామని పలువురు లబ్ధిదారులు నిత్యం హౌసింగ్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కొందరైతే బేస్మెంట్ వరకు నిర్మించారు. మరోవైపు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు మొదలయ్యాయి. వర్షాల కారణంగా ఇబ్బందులు తప్ప వని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.