
తుడా చైర్మన్గా దివాకర్రెడ్డి
తిరుపతి తుడా:తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) చైర్మన్గా డాలర్స్ దివాకర్ రెడ్డి పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 నామినేటెడ్ పోస్టుల ను భర్తీ చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లా పరిధిలో నలుగురికి చోటు లభించింది.
ఆశావహులకు భంగపాటు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ సీనియర్ నాయకులు మబ్బుదేవనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి నుంచి శంకర్రెడ్డి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఆశీస్సులతో బడి సుధాయాదవ్, నగిరి నియోజకవర్గానికి చెందిన ఓ కాంట్రాక్టర్ తుడా చైర్మన్ కోసం పోటీ పడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సైతం చివరి వరకు పైరవీలు చేశారు. అనేక మంది ఆశావహులు పోటీపడి భంగపడ్డారు. చివరికి మంత్రి లోకేష్ ఆశీస్సులతో దివాకర్ రెడ్డికే తుడా చైర్మన్గిరి దక్కింది. నామినేటెడ్ పదవులు ప్రకటించడంతో తిరుపతిలోని టీడీపీ ముఖ్యనేతలంతా అసంతృప్తిలో ఉన్నారు.
అసంతృప్తిలో సీనియర్లు
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నాలుగు నామినేటెడ్ పదవులను ప్రకటించారు. ఇందులో తుడా చైర్మన్ సహా మిగిలిన పోస్టుల భర్తీ పై అసంతృప్తి సెగలు వ్యక్తమవుతున్నాయి. తమకు పనికిరాని పదవులు కట్టబెట్టారని మండిపడుతున్నారు. ఈ పదవులు నాలుక మీద గీసుకునేందుకు కూడా పనికిరావని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పార్టీ అధిష్టానం పై రగిలిపోతున్నారు.
నామినేటెడ్ పదవుల్లో పలువురికి చోటు
చిత్తూరు అర్బన్: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కూటమి నాయకులకు పదవులు వరించాయి. ఇందులో రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా కుప్పంకు చెందిన రాజశేఖర్, రాష్ట్ర గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతికి చెందిన సుగుణమ్మ, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా తిరుపతికి చెందిన దివాకర్ను, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతికి చెందిన పసుపులేటి హరిప్రసాద్ను నియమించింది.
బంగారు నగలు అప్పగింత
చిత్తూరు అర్బన్ : పోగొట్టుకున్న బంగారు నగలను ఓ వ్యక్తి పోలీసుల సమక్షంలో ఆదివారం బాధితుడికి అప్పగించారు. చిత్తూరు వన్టౌన్ పోలీసుల వివరాల మేరకు గంగాధర నెల్లూరు మండలానికి చెందిన కాంట్రాక్టర్ యోగానందం జ్యోతి ట్రేడర్స్లో రెండు బ్యాగుల బియ్యం కొనుగోలు చేశారు. ఈ బ్యాగులను కారులో పెడుతున్న సమయంలో బంగారు ఆభరణాల బ్యాగును మరిచి..రోడ్డుపైనే పెట్టేసి బెంగుళూరు వెళ్లిపోయాడు. ఇంటికెళ్లి చూసే సరికి ఆ నగల బ్యాగు కనిపించకుండా పోయింది. దీంతో బాధితుడు వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ఆ ప్రాంతంలో ఓ చిన్న షాపు నడుపుతున్న వినాయకం ఆ బంగారు ఆభరణాల బ్యాగును భద్రపరిచినట్లు గుర్తించారు. పోగొట్టుకున్న 240 గ్రాముల బంగారు ఆభరణాల బ్యాగును బాధితుడికి అప్పగించారు. ఈ సందర్భంగా వినాయకంను అభినందించి రూ. 5 వేల నగదును బహుమతిగా అందజేశారు.
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులు క్రీడల్లో రాణించాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంజయ్ గాంధీ నగర్లో ఉన్న ఏపీఎస్డబ్ల్యూఆర్ బాలికల గురుకుల పాఠశాలలో వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముంబయికి చెందిన హై 5 బాస్కెట్ బాల్ ఫౌండేషన్ ఏప్రిల్ 26 నుంచి మే 11 వరకు బాస్కెట్ బాల్ వేసవి రెసిడెన్షియల్ శిక్షణ నిర్వహించారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి అవసరమైన ఖర్చులు మొత్తం ఫౌండేషన్ నిర్వహించిందని తెలిపారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు ఫౌండేషన్ నిర్వహించిన శిక్షణ శిబిరం అభినందనీయమన్నారు. అనంతరం వేసవి శిక్షణ కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పి చిన్నికష్ణ, బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెంగల్రాయ నాయుడు, హై 2 ఫౌండేషన్ మేనేజర్ స్నేహిత, జయ సూర్య పాల్గొన్నారు.

తుడా చైర్మన్గా దివాకర్రెడ్డి

తుడా చైర్మన్గా దివాకర్రెడ్డి